
మన్యం వీరుల పోరు అజరామరం
దేశం కోసం ప్రాణాలర్పించిన ధీరులు
గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి. కేఆర్పురం ఐటీడీఏకు కారుకొండ సుబ్బారావు పేరు పెట్టాలి. గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధులకు తగిన గౌరవం ఇవ్వాలి.
– అయినారపు సూర్యనారాయణ, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు
నేను గిరిజన వీరుడు కారుకొండ సుబ్బారెడ్డి ముని మనవడను. మాది పోలవరం మండలం కోండ్రుకోట. తెల్ల దొరలపై మా తాత చేసిన పోరాటాన్ని మా పెద్దలు మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సమరయోధుల కుటుంబానికి చెందిన మాకు ఎటువంటి గుర్తింపు లేదు. ప్రభుత్వం ఇప్పటికై నా గుర్తించి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి.
– కారుకొండ అబ్బాయిరెడ్డి, కోండ్రుకోట
బుట్టాయగూడెం: బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఉరి కొమ్మలకు వేలాడి ప్రాణాలు విడిచిన గిరిజన పోరాట వీరులు ఎందరో ఉన్నారు. వారి పోరాటాలు, త్యాగాలకు చారిత్రక ఆధారాలు లేకపోయినా ఆనాటి శిథిల భవనాల్లో ఆ జ్ఞాపకాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ఆ అమర వీరులను దేశ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా స్మరించుకుందాం.
వెలుగులోకి రాని వీరుల త్యాగం
తెల్లదొరలను ఎదురించి ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో నలుగురు అజ్ఞాత స్వాతంత్య్ర పోరాట వీరులు పశ్చిమ మన్యానికి చెందిన వారు ఉన్నారు. అల్లూరి సీతారామరాజుకి ముందే వీరు పోరాటం చేసి మృతి చెందినప్పటికీ ఆ గిరిజన వీరుల త్యాగాలు వెలుగులోకి రాలేదు. ఆ నలుగురు వీరులు కారుకొండ సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్య, కుర్ల వెంకట సుబ్బారెడ్డి, గురుగుంట్ల కొమ్మురెడ్డి. వీరు 1858లో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచినట్లు చరిత్ర తెలిసిన పూర్వీకులు చెబుతున్నారు.
తిరుగుబాటులో కారుకొండ సుబ్బారెడ్డి కీలకం
1857లో యావత్ భారతదేశంలో స్వాతంత్య్ర సమరం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొరుటూరుకు చెందిన కొండరెడ్డి గిరిజన తెగకు చెందిన కారుకొండ సుబ్బారెడ్డి పోలవరం పరిసరాల ప్రాంతంతో పాటు బుట్టాయగూడెం నుంచి యర్నగూడెం వరకూ ఉన్న గిరిజన గ్రామాలకు జమిందారుగా ఉండేవారు. ఆయన స్వాతంత్య్ర సమరం జరుగుతున్న సమయంలో యర్నగూడెంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశాడు. ఆ సమయంలో గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న సుమారు 40 గ్రామాలతో బ్రిటీష్ వారిపై దండయాత్ర చేసి విజయం సాధించారు. సుబ్బారెడ్డికి ముఖ్య అనుచరుడిగా కుర్ల సీతారామయ్య ఉండేవారు. అలాగే గురుగుంట్ల కొమ్మురెడ్డి, అప్పటి తూర్పుగోదావరి జిల్లా కొండమొదలు గ్రామానికి చెందిన కుర్ల వెంకటరెడ్డి కలిసి తెల్లదొరలపై వీరోచిత పోరాటం చేశారు. ఆ సమయంలో సుబ్బారెడ్డి తలకు బ్రిటిష్ వారు రూ.2,500 వెల కట్టారు. చివరకు కొందరు గిరిజనులు వెన్నుపోటు పొడిచి కారుకొండ సుబ్బారెడ్డితోపాటు అతని అనుచరులను, మరికొందరు విప్లవ వీరులను 1858 జూన్ 11వ తేదీన బ్రిటీష్ వారికి పట్టించారు. 1858 అక్టోబర్ 7వ తేదీన కోర్టు విచారణ అనంతరం 8 మందిని అండమాన్ జైలుకు పంపారు. 35 మంది గిరిజన వీరుల్ని గుంటూరు దగ్గరున్న జైలులో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కారుకొండ సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్యలను బుట్టాయగూడెంలో ఉరి తీశారు. మిగిలిన ఆరుగురిని పోలవరం సమీపంలో ఉన్న దివానం వద్ద ఉరి తీశారు. కారుకొండ సుబ్బారెడ్డి చేసిన పోరాటానికి కోపోద్రిక్తులైన బ్రిటీష్వారు సుబ్బారెడ్డి మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని చిన్న బోనులో పెట్టి రాజమండ్రి దగ్గర ఉన్న కోటగుమ్మం వద్ద ప్రజలు చూసేవిధంగా వేలాడదీశారు. స్వాతంత్య్రం రావడానికి కొన్నేళ్ల ముందు వరకూ కూడా సుబ్బారెడ్డి మృతదేహం కోటగుమ్మం వద్ద వేలాడుతూ ఉండేదని పాతతరం వారు చెబుతున్నారు. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఉరి కొమ్మలకు వేలాడిన ఆ అమర వీరుల పోరు అజరామరం.
పాత పోలవరంలో బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్న రెడ్డిరాజుల భవనం శిథిలావస్థలో ఉన్న దృశ్యం
బ్రిటీష్ వారిపై పోరాటం చేసి మరణించిన వీరుల గ్రామం కొరుటూరు ముంపునకు గురై శిథిలావస్థలో ఉన్న దృశ్యం
తెల్లదొరలను గడగడలాడించిన మన్యం బిడ్డలు
బ్రిటీష్ వారికి పోరాటయోధులను పట్టించిన వెన్నుపోటుదారులు
8 మంది వీరులను ఉరితీసిన బ్రిటీష్ పాలకులు

మన్యం వీరుల పోరు అజరామరం

మన్యం వీరుల పోరు అజరామరం

మన్యం వీరుల పోరు అజరామరం

మన్యం వీరుల పోరు అజరామరం

మన్యం వీరుల పోరు అజరామరం