
బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: ప్రభుత్వం స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్డీఓ బి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు అండర్–22 విభాగంలో మహిళలు, పురుషులకు 10 క్రీడాంశాల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నామన్నారు. జిల్లా జట్లకు ఎంపికై న వారు జోనల్ పోటీల్లో తలపడతారన్నారు. పరిశీలకురాలిగా హాజరైన శాప్ డైరక్టర్ కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడుతూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు శాప్ పోటీలు చేపడుతోందన్నారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ క్రీడాంశాల్లో పోటీలు చేపట్టి జట్ల ఎంపిక పూర్తి చేశారు.
రోల్బాల్ జట్టు ఎంపిక
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోల్ బాల్ స్టేట్ సెలక్షన్ క్యాంప్ ఈనెల 7 నుంచి 10 వరకు తణుకు సిల్వర్ జూబ్లీ కాలనీలోని మునిసిపల్ స్కేటింగ్ పార్కులో నిర్వహించారు. వివిధ విభాగాల్లో జాతీయస్థాయి పోటీలకు జట్టు ఎంపిక చేశారు. మొత్తం 100 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ క్యాంపులో 60 మందిని ఎంపిక చేసినట్లు రోల్బాల్ స్టేట్ సెక్రటరీ అనిల్కుమార్రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో కేరళలోని కొల్లాంలో నిర్వహించే సౌత్ జోనల్స్కి జట్టును సంసిద్ధం చేశామని చెప్పారు. 60 మంది ఎంపిక కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకుకు చెందిన 9 మంది క్రీడాకారులు ఉన్నట్లుగా వివరించారు. కార్యక్రమంలో స్టేట్ టెక్నికల్ చైర్మన్ వీజీ ప్రేమ్నాథ్, స్టేట్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ తోట లలిత ప్రియ, కోచెస్ కమిటీ డైరెక్టర్ పూసర్ల సంతోష్ కుమార్, ఉమెన్ కమిషన్ డైరెక్టర్ వానపల్లి లావణ్య, కోచెస్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మధుబాబు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కోచ్లు పాల్గొన్నారు.