
క్రీడా పోటీలు సరే.. సౌకర్యాలేవి?
తణుకు అర్బన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తణుకులో నిర్వహిస్తున్న క్రీడా ఎంపికలు క్రీడాకారులు సహనానికి పరీక్షగా మారాయి. జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ క్రీడా ఎంపికల్లో విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనలో అవకతవకలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి. తణుకు వేదికగా జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు క్రీడాకారుల ప్రతిభకే కాకుండా వారికి తీవ్ర అసహనాన్ని కల్పించాయి. ముఖ్యంగా క్రీడా ఎంపికలకు వచ్చిన క్రీడాకారులకు మంచినీరు తప్ప మరే ఆహారం ఇవ్వకపోవడంతో వారంతా ఉక్కపోత వాతావరణానికి ఓ పక్క నీరసం, మరో పక్క ఆకలితో నకనకలాడారు. మధ్యాహ్నం 1 గంటకు ఎంపికలు పూర్తయినే వెంటనే రాష్ట్రపతి రోడ్డులో ఉన్న దుకాణాల వద్దకు పరుగులుపెట్టారు. చేతిలో డబ్బులు ఉన్న క్రీడాకారులు ఆకలి తీర్చుకోగా మిగిలిన వారు ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాకుండా క్రీడలకు సైతం పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంతో క్రీడాకారులు శారీరకంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హాకీ క్రీడకు సంబంధించి భీమవరం, శృంగవృక్షంకు చెందిన క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్రీడా ప్రాంగణంలో ఉన్న గడ్డి దుబ్బులతో బాల్ గమనంపై సరిగా దృష్టిసారించలేకపోవడంతో పడిపోయిన సందర్భాలు కూడా ఎదురయ్యాయని క్రీడాకారులు వాపోయారు. భోజన వసతులు లేకపోవడంతో బ్యాగ్లు మోసుకుంటూ వెళ్లి మెస్లలో భోజనం చేయాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడా అసోసియేషన్లు ఏర్పాటుచేసే ఎంపికలకే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అండర్ 22లోపు..
తణుకులో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీచిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్కేఎస్డీ మహిళా కళాశాల, మాంటిస్సోరీ స్కూలులో ఈనెల 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు అండర్ 22 లోపు క్రీడాకారులకు 10 క్రీడాంశాల్లో ఈ క్రీడా ఎంపికలు నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ క్రీడా ఎంపికల్లో అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, హాకీ, ఆర్చరీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అంశాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటిరోజు 82 మంది క్రీడాకారులు హాజరుకాగా, రెండోరోజైన శనివారం 125 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆదివారంతో ఈ క్రీడా ఎంపికలు ముగియనున్నాయి. శనివారం ఆర్చరీకి సంబంధించి జోనల్ స్థాయి పోటీలకు 24 మందిని, అథ్లెటిక్స్లో 20, బాస్కెట్బాల్ 24, బాక్సింగ్ 25, హాకీలో 32 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి ఎం.రాజేష్ తెలిపారు.
‘ఆడుదాం ఆంధ్ర’తో సౌకర్యాలు ఫుల్...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించి నాణ్యమైన క్రీడాకారులను వెలికితీయాలనే ఉద్దేశ్యంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో క్రీడాకారులకు చక్కని సౌకర్యాలతో క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలకు వచ్చేవారికి అల్పాహారంతోపాటు భోజన వసతి కూడా కల్పించారు. క్రీడలకు సంబంధించి క్రీడా పరికరాలు ప్రభుత్వమే సరఫరా చేయడం, విజేతలకు ధ్రువపత్రాలు, మెమొంటోలు, మెడల్స్తోపాటు భారీ నజరానా కూడా అందజేశారు.
ఆకలితో అలమటించిన క్రీడాకారులు
తినుబండారాల కోసం దుకాణాల వెంబడి పరుగులెత్తిన వైనం
ప్రమాదకరంగా క్రీడా ప్రాంగణం

క్రీడా పోటీలు సరే.. సౌకర్యాలేవి?