
నేరాల నిరోధానికి చర్యలు
ఏలూరు టౌన్: జిల్లాలో ఆయా కేసులకు సంబంధించి కోర్టులో విచారణలోని కేసులను త్వరితగతిన పరిష్కరించేలా, నిందితులకు శిక్షలు పడేలా కోర్టు మానిటరింగ్ సెల్ మరింత పటిష్టంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశించారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్లకు సంబంధించి కోర్టు కానిస్టేబుళ్లతో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావుతో కలిసి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ కోర్టు మానిటరింగ్ సెల్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్ విధులు కీలకమైనవన్నారు. కోర్టు పరిధిలోని ఆయా కేసులకు సంబంధించి విచారణలపై కేసుల్లోని సాక్షులను సకాలంలో కోర్టు ఎదుట హాజరుపరచటం, నిందితులకు శిక్షలు పడేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. డీసీఆర్బీ సీఐ హబీబ్ బాషా, మహిళా స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, డీసీఆర్బీ ఎస్సై రాజారెడ్డి, జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.