
యానాం మద్యం విక్రేతకు రూ.లక్ష జరిమానా
తణుకు అర్బన్: యానాం మద్యం విక్రయాలు చేస్తున్న వ్యక్తికి ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ ఎం.సుందరరాజు రూ.లక్ష జరిమానా విధించినట్లు తణుకు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు. ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి ఇటీవల రెండు పర్యాయాలు యానాం మద్యంతో దొరికిన నేపథ్యంలో ఈ భారీ జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి 7న కంతేరు గ్రామంలో కారులో 43.1 లీటర్ల యానం మద్యం తరలిస్తూ తణుకు ఎకై ్సజ్ శాఖ దాడుల్లో పట్టుబడ్డాడని, దీంతో అతడిని ఇరగవరం మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద రూ.లక్ష పూచీకత్తుతో ఏడాది కాలానికి బైండోవర్ చేయడం జరిగిందన్నారు. సత్ప్రవర్తన బాండ్ను ఉల్లంఘించి తిరిగి మే 26న యానాం నుంచి మద్యాన్ని కారులో రవాణా చేస్తూ తణుకు ఎక్సైజ్ శాఖకు మరోసారి పట్టుబడ్డాడని చెప్పారు. దీంతో ఈనెల 11న ఇరగవరం తహసీల్దార్ వద్ద హాజరపరచగా దీనిపై విచారణ అనంతరం విధించిన జరిమానాను ముద్దాయి గురువారం చెల్లింపు చేసినట్లు వివరించారు.
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
ముదినేపల్లి రూరల్ : యువకుడి అదృశ్యంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం మండలంలోని పెదగొన్నూరు శివారు కర్షకమాలపల్లికి చెందిన మద్దాల మరియమ్మ కుమారుడు కిరణ్బాబు గుంటూరులోని ఒక స్వీటు షాపులో పనిచేసేవాడు. ప్రమాదవశాత్తూ గాయపడడంతో కర్షకపాలెంలోని ఇంటి వద్దకు వచ్చి ఆరోగ్యం కుదుటపడిన తరువాత ముదినేపల్లి, బంటుమిల్లి, సింగరాయపాలెం గ్రామాల్లోని స్వీటుషాపుల్లో పనిచేసేవాడు. ప్రతిరోజు వచ్చే ఆదాయంతో మద్యం సేవించి తల్లిని దుర్భాషలాడుతూ బాధపెట్టేవాడు. ఈ ఏడాది మార్చి 30న మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని తల్లి మరియమ్మను ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో తల్లిని తూలనాడి ఇంటినుంచి వెళ్లిపోయాడు. నాటి నుంచి కిరణ్బాబు ఆచూకీ తెలియకపోవడంతో తల్లి మరియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
యథేచ్ఛగా కంకర అక్రమ తవ్వకాలు
సాక్షి, టాస్క్ఫోర్స్ : కూటమి పాలనలో మట్టి దందా దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్న చందంగా తయారైంది. కోర్టు నుంచి స్టే ఉన్నా వారు లెక్క చేయని పరిస్థితి. ఉంగుటూరు మండలం నల్లమాడులో కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మూడు తరాల నుంచి ఒక పేద కుటుంబం హక్కు భుక్తంలో ఉన్న మెరసుకుంటను ఆనుకొని ఉన్న సుమారు ఒకటిన్నర ఎకరం కంకర బీడులో 15 రోజులుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కంకరను జేసీబీలు, పొక్లయినర్ల సాయంతో తవ్వి లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముసనబోయిన అంజమ్మకు చెందిన ఈ భూమి విషయంలో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా కూటమి నాయకలు లెక్కచేయడం లేదు. పంచాయతీ, ఇరిగేషన్ అధికారుల అనుమతితో తవ్వకాలు చేస్తున్నట్లు ఆ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో గ్రామ, మండల స్థాయి అధికారుల జేబులు నింపుతున్నారని వినికిడి. కంకర తవ్వకాలపై గ్రామ రెవెన్యూ అధికారి నాగరాజుని వివరణ కోరగా కంకర తవ్వకాలకు అనుమతులు ఉన్నట్లు చెబుతున్నారు.

యానాం మద్యం విక్రేతకు రూ.లక్ష జరిమానా

యానాం మద్యం విక్రేతకు రూ.లక్ష జరిమానా