
వ్యక్తిపై హత్యాయత్నం
ఏలూరు టౌన్, పెదపాడు : దెందులూరు నియోజకవర్గం పెదపాడు గ్రామంలో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కత్తులు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. బాధితుడి మెడభాగంలో తీవ్ర గాయం కావటంతో అతడ్ని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. టీడీపీకి చెందిన కార్యకర్తల ఆధ్వర్యంలో పాతకక్షల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు గ్రామానికి చెందిన ముమ్మిడి నాగరాజు భవన నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. గురువారం సాయంత్రం పెదపాడు సినిమా థియేటర్ సెంటర్లోని ఒక స్థలం వద్ద ట్రాక్టర్లో ఇసుక లోడ్ను చేస్తుండగా రెండు మోటారు సైకిళ్లపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేయటంతో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. నాగరాజు పక్కన ఉన్న మణిశ్రీ అనే వ్యక్తి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా నలుగురు అతనిపై దాడి చేసేందుకు రావటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే తనపై దాడి జరిగిందని బాధితుడు నాగరాజు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
రెండు రోజుల కిత్రం
కుటుంబ సభ్యులపై దాడి
నాగరాజు కుమారుడు సాయిపై రెండు రోజుల క్రితం పెదపాడుకు చెందిన నర్రా చందు మరికొందరు దాడి చేశారు. అనంతరం నర్రా చందు, అక్కినేని పండు, కళ్యాణ్ ఇంకా మరికొందరు నాగరాజు ఇంటికి వెళ్లి అతడి భార్యను దుర్భాషలాడి, ఆమైపె దాడికి యత్నించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తనను అంతం చేయాలనే కత్తులు, రాడ్లతో గుర్తు తెలియని వ్యక్తులతో వారే దాడులు చేయించారని బాధితుడు నాగరాజు పేర్కొన్నాడు. తనకు, తన కుమారుడు సాయికి ప్రాణహాని ఉందనీ, రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.
పెదపాడులో వ్యక్తిపై కత్తులు, రాడ్లతో దాడి
పాతకక్షల నేపథ్యంలో దాడులు