బస్సులు లేక.. ప్రయాణం సాగక | - | Sakshi
Sakshi News home page

బస్సులు లేక.. ప్రయాణం సాగక

Jun 21 2025 3:35 AM | Updated on Jun 21 2025 3:35 AM

బస్సు

బస్సులు లేక.. ప్రయాణం సాగక

శనివారం శ్రీ 21 శ్రీ జూన్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు: లక్షలాది మంది ప్రజల రాకపోకలతో బస్టాండ్లు కిటకిటలాడుతుంటాయి. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి పట్టణాలకు రావడానికి కీలక వారధిగా ఉండే ప్రజా రవాణా వ్యవస్థ శుక్రవారం స్తంభించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 60 శాతానికిపైగా బస్సులు విశాఖ జిల్లాకు తరలించడంతో బస్టాండ్లలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్న పరిస్థితి. మరోవైపు చుట్టుపక్కల గ్రామాలకు ఆటోలే దిక్కు అయ్యాయి. శనివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా డేకు జిల్లాలోని బస్సులు తరలించడంతో ప్రజా రవాణా నిలిచిపోయింది.

7 డిపోలు.. 355 బస్సులు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 7 డిపోల నుంచి 355 బస్సులను విశాఖ సభకు ప్రభుత్వం కేటాయిం చింది. అన్ని డిపో మేనేజర్లకు ఉత్తర్వులు రావడంతో గురువారం సాయంత్రం నుంచే విడతల వారీగా బస్సులను పంపారు. మొత్తంగా ఏలూరు జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల్లో కలిపి 305 సర్వీసులు, అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 305 సర్వీసులు ఉన్నాయి. శుక్రవారం అన్ని బస్టాండల్లో ప్రయాణికుల రద్దీతో పాటు గంటలతరబడి పడిగాపులు అనివార్యంగా కొనసాగాయి. 80 శాతం ఆక్యూపెన్సీతో ఉమ్మడి జిల్లాలో ఆర్‌టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రధానంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణుకు ఇలా అన్ని ప్రధాన ప్రాంతాలకు చుట్టుపక్కల వందల గ్రామాల నుంచి రోజూ సగటున 60 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుంటారు. దీనిలో ఆర్‌టీసీలోనే సుమారు 25 వేల మందికిపైగా రాకపోకలుంటాయి. అలాగే కళాశాల విద్యార్థులు కూడా అత్యధికంగా ప్రజా రవాణానే వినియోగిస్తుంటారు. ఈ పరిణామాల క్రమంలో బస్సులన్నీ విశాఖకు తరలించడంతో అన్ని ప్రాంతాల్లో రాకపోకలు కొంతమేర స్తంభించాయి.

ప్రయాణికులకు చుక్కలే.. ఏలూరు బస్టాండ్‌ నుంచి విజయవాడకు రోజూ 72 ట్రిప్పులు నాన్‌స్టాప్‌ సర్వీసులు నడుపుతున్నారు. అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులు అన్నీ కలుపుకుని ఏలూరు నుంచి 150 వరకు సర్వీసులు ఉన్నాయి. శుక్రవారం దాదాపు 70 శాతం సర్వీసులకు బస్సులు లేకపోవడంతో నామమాత్రంగా సర్వీసులను నడిపారు. అలాగే ఏలూరు నుంచి రాజమండ్రి, రావులపాలెంకు 6 సర్వీసులుండగా వాటిని రెండింటికి పరిమితం చేశారు. రోజూ ఒక్క ఏలూరు డిపో నుంచి 19 నుంచి 20 వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇక జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఏలూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది విద్యార్థులకు ఆటోలే దిక్కయ్యాయి. అలాగే విజయవాడకు ప్రైవేట్‌ ట్రా వెల్స్‌ వాహనాలే అనివార్యమయ్యాయి. ఏలూరు జిల్లాలో ని ఏలూరు డిపో నుంచి 80 బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో నుంచి 52 బస్సులు, నూజివీడు డిపో నుంచి 38 బస్సులు విశాఖకు పంపారు. అవసరమైతే మరో 50 బస్సులు పంపడానికి అధికారులు ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారు.

న్యూస్‌రీల్‌

‘పశ్చిమ’లోనూ ఇదే పరిస్థితి

పశ్చిమగోదావరి జిల్లాలో 305 బస్సులకుగాను 185 బస్సులను విశాఖకు తరలించారు. భీమవరం డిపో నుంచి 51, నరసాపురం డిపో నుంచి 41, తాడేపల్లిగూడెం డిపో నుంచి 41, తణుకు డిపో నుంచి 52 బస్సులు శుక్రవారం విశాఖకు పంపారు. ప్రధానంగా భీమవరం నుంచి విజయవాడ, ఏలూరుకు 40 బస్సులు, భీమవరం నుంచి తణుకు, తాడేపల్లిగూడెంకు మరో 40 బస్సులు 90 శాతం ఆక్యూపెన్సీతో రాకపోకలు సాగిస్తుంటారు. పూర్తి గ్రామీణ ప్రాంతాలు కావడంతో పల్లె వెలుగు సర్వీసులపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సగటున రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు రోజువారీ ఆదాయం సమకూరుతుంది. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ఆదివారం ఉదయం వరకు బస్సులు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా భీమవరం–పాలకొల్లు, భీమవరం–నరసాపురం, తాడేపల్లిగూడెం–తణుకు మధ్య తప్పని పరిస్థితుల్లో రెండు రోజులపాటు ఆటో ప్రయాణాలే ప్రజలకు దిక్కయ్యాయి.

రవాణా కష్టాలు

బస్సులన్నీ విశాఖకు తరలింపు

ఉమ్మడి పశ్చిమ నుంచి 355 బస్సులు

బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

గంటల తరబడి ఎదురుచూపులు

కళాశాల విద్యార్థులకు ఆటోలే దిక్కు

జిల్లాలో 40 శాతమే నడిచిన సర్వీసులు

బస్సులు లేక.. ప్రయాణం సాగక 1
1/1

బస్సులు లేక.. ప్రయాణం సాగక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement