
శ్రీవారి దేవస్థానం కాంట్రాక్ట్ సిబ్బంది నిర్వాకం
దేవస్థానం హైస్కూల్ గ్రౌండ్లో మద్యం సేవించిన ట్రాక్టర్ డ్రైవర్, స్కావెంజర్
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం హైస్కూల్ గ్రౌండ్లో ఇద్దరు ఆలయ కాంట్రాక్ట్ ఉద్యోగులు సోమవారం మద్యం సేవించడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానంలో సెవెన్ హిల్స్ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తోంది. కాంట్రాక్ట్ తరుఫున పనిచేస్తున్న ఒక ట్రాక్టర్ డ్రైవర్, మరో స్కావెంజర్ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్థానిక హైస్కూల్ గ్రౌండ్లోని స్టేజీపై కూర్చుని మద్యం సేవిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పారిశుద్ధ్య పనులకు వినియోగించే ట్రాక్టర్ను సైతం గ్రౌండ్లో వారి వద్దే పెట్టుకున్నారు. మధాహ్నం 3 గంటలకు విధులకు వెళ్లాల్సి ఉండగా, ఇప్పుడు మద్యం సేవిస్తున్నారేమిటని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు, వేసవికాలం కావడంతో సాయంత్రం 4 గంటలకు విధులకు వెళ్తామని ట్రాక్టర్ డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. అయినా పాఠశాల గ్రౌండ్లో తాగడం ఏమిటని అడిగితే గ్రౌండ్లో ఉన్న ఖాళీ మద్యం బాటిళ్లను చూపించి, ఇవన్నీ అవే కదా అని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
బెల్లం అమ్మిన కేసులో రూ.25 వేల జరిమానా
కామవరపుకోట: నాటు సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మిన కేసులో ఒక వ్యక్తికి రూ. 25 వేల జరిమానా విధించినట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈస్ట్ యడవల్లికి చెందిన శ్రీ సాయి రంగ ప్రకాష్ గ్రామంలో నాటు సారాయి తయారు చేసే వారికి బెల్లం సరఫరా చేసిన కేసులో తహసీల్దార్ జి.ఎలిసా జరిమానా విధించినట్లు తెలిపారు.