● రత్నగిరిపైకి వాహనాల అనుమతిపై
అధికారులకు ఎస్పీ ఆదేశం
● మద్యం సీసాలున్నా..
మద్యం తాగిన వారు ఉన్నా పంపవద్దు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయానికి వచ్చే ప్రతి వాహనాన్ని టోల్ గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేశాకే కొండ మీదకు అనుమతించాలని ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం ఆదేశించారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇదేం పద్ధతి స్వామీ’ కథనంపై ఎస్పీ స్పందిస్తూ ఈ మేరకు ప్రత్తిపాడు సీఐ వి.సూర్య అప్పారావుకు ఆదేశాలు ఇచ్చారు. గత బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం తాగి పెళ్లి బృందాలపై దాడి చేయడం, రత్నగిరి అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో, వివాహాలు జరిగే సత్యగిరి తొండంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఉండడం వల్ల వారి మధ్య సమన్వయం లేక ఏవైనా ఘటనలు జరిగినపుడు వారి స్పందనలో జాప్యం ఏర్పడుతోందన్న అంశాలపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం సీఐ అప్పారావు దేవస్థానానికి వచ్చి సెక్యూరిటీ సిబ్బందితో సమావేశమయ్యారు. ఆలయానికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి నిషేధిత వస్తువులు లేవని తేలిన తరువాతే కొండ పైకి పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఏవైనా దుస్సంఘటనలు జరిగితే సత్వరం తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని, సీసీ కెమేరాల నిఘా పెంచి గొడవలు సృష్టించే వారిని, అనుమానితులను గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం డ్రోన్ కెమేరా ద్వారా దేవస్థానం టోల్గేట్, ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. సమావేశంలో స్థానిక ఎస్ఐ హరిబాబు, దేవస్థానం సెక్యూరిటీ అధికారి ఆకుల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


