● కిలోకు రూ.10 పెరిగిన పొగాకు
● జగన్ పర్యటన నేపథ్యంలో కదలిక
దేవరపల్లి: రెండు రోజులుగా వర్జీనియా పొగాకు ధర మార్కెట్లో స్వల్పంగా పెరిగింది. దాదాపు వంద రోజులుగా నిలకడగా ఉన్న కిలో గరిష్ఠ ధర రూ.265 నుంచి రూ.10 పెరిగి రూ.275కి చేరింది. ఈ ఏడాది కొనుగోళ్లలో ఎక్కువ శాతం కిలో పొగాకు రూ.160 నుంచి రూ.180 పలకడంతో రైతులు దిగాలు పడ్డారు. దీంతో ఆందోళన బాట పట్టిన రైతులకు మే ఆరో తేదీన దేవరపల్లి వేలం కేంద్రం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మాజీ హోం మంత్రి తానేటి వనిత నాయకత్వంలో పార్టీ శ్రేణులు అండగా నిలచి ధర్నా చేసి, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశాయి. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేకపోవడంతో పొగాకు రైతులు ఇటీవల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ ఇబ్బందులు వివరించి, వేలం కేంద్రాలను సందర్శించి, తమకు న్యాయం జరిగే వరకు పోరాడాలని కోరారు. మీరు అడుగు పెడితే తమకు మేలు జరుగుతుందని కోరారు. ఈ మేరకు వచ్చే నెల 5న దేవరపల్లి వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించనున్న నేపథ్యంలో సోమవారం నుంచి మార్కెట్లో ధర పెరిగింది. కిలోకు రూ.10 పెంచి కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో కిలో గరిష్ఠ ధర రూ.275, కనిష్ఠ ధర రూ.170, సగటు ధర రూ.243.72 లభించింది. ఐదు వేలం కేంద్రాలకు 4127 బేళ్లు విక్రయానికి రాగా, 2536 బేళ్లు కొనుగోలు చేశారు. 1591 బేళ్లు తిరస్కరించారు. రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకు జరిగిన పొగాకు ధరలు ఇలా ఉన్నాయి.
వేలం కేంద్రం గరిష్ఠ ధర కనిష్ఠ ధర కొనుగోళ్లు (కిలోల్లో) సగటు ధర
దేవరపల్లి 275 170 1388483 239.55
జంగారెడ్డిగూడెం–1 275 170 1994422 245.22
జంగారెడ్డిగూడెం–2 275 170 2156770 244.75
కొయ్యలగూడెం 275 170 1976976 242.02
గోపాలపురం 275 170 1989829 245.68


