లోకేశ్దే బాధ్యత
డీఎస్సీ నియామకాల విషయంలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయి. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలి. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను రూ.15 లక్షల చొప్పున అమ్ముకుని నిరుద్యోగులను మోసం చేశారు. నీట్ పరీక్షల ప్రశ్న పత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన ఆందోళనల తరహాలోనే లోకేశ్ రాజీనామా చేసే వరకూ వైఎస్సార్ సీపీ తరఫున ఉద్యమిస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం పని అయిపోయింది. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చే వరకు తమ పోరాటం ఆగదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంతోపాటు నిరుద్యోగ భృతి అందించాలి. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వ ప్రోద్బలంతో పెడుతున్న కేసులన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటాం.
– మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ,
రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త
నిరుద్యోగ భృతి ఎవరికిచ్చారు?
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక అన్నీ మరిచిపోయారు. జిల్లాలోని 3 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున బకాయిపడిన రూ.2,160 కోట్ల నిరుద్యోగ భృతి తక్షణమే విడుదల చేయాలి.
– ఆరె చిన్ని, వైఎస్సార్ సీపీ
యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


