నిడదవోలు రూరల్: మునిపల్లి గ్రామ శివారున మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ స్తంభాన్ని టిప్పర్ ఢీకొని దగ్ధమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొల్లి కృష్ణ ఐ.పంగిడి నుంచి నరసాపురానికి మెటల్ లోడ్తో వెళుతున్నాడు. మార్గం మధ్యలో నిద్రమత్తు కారణంగా లారీ అదుపు తప్పి మునిపల్లి రహదారి పక్కనే ఉన్న కోయిల వెంకటేష్కు చెందిన ప్రహరీతో పాటు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో లారీ బోల్తా పడింది. డీజిల్ ట్యాంకుపై విద్యుత్ తీగలు పడి మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో చిక్కుకున్న డ్రైవర్ కృష్ణను స్థానికులు బయటకు లాగారు. ఈ ఘటనలో అతడి కాలుకు తీవ్రగాయమైంది. గ్రామస్తుల సమాచారం ఇవ్వడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


