చింతూరు: అడ్డుగా వచ్చిన పశువులను తప్పించే క్రమంలో వ్యాన్ బోల్తా పడింది. చింతూరు మండలం సింగన్నగూడెంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. చింతూరు మండలం ఎర్రంపేటలో ఇంటి నిర్మాణ పని కోసం భద్రాచలం నుంచి 10 మంది కూలీలు వ్యాన్లో బయలుదేరారు. వారి వాహనం సింగన్నగూడెం వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారి 30పై పశువులు అడ్డుగా వచ్చాయి. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తా పడడంతో దానిలో పది మంది కూలీలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో వర్సా వీరభద్రం, రాములమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలానికి రిఫర్ చేశారు.
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
కాకినాడ క్రైం: కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి జిల్లాల పరిధిలో రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ బిందుమాధవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జగన్నాథఫురానికి చెందిన ధర్మాడి దుర్గాప్రసాద్, అనపర్తి మండలం బలభద్రపురానికి చెందిన గొర్రిపూడి వెంకట రమణ, కుతురులూరుకు చెందిన పాసి శేఖర్, తాడేపల్లిగూడెం కాకర్లమూడికి చెందిన గేదెల మహేష్తో పాటు ఓ బాలుడు రాత్రి వేళల్లో ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరందరూ ఇప్పటివరకూ 10 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వారిని సోమవారం సాయంత్రం తూరంగి శివాలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 380.7 గ్రాముల బంగారం, 2.854 కిలోల వెండి, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. వారి విలువ సుమారు రూ.57 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు అధికారులను అభినందించారు.


