కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రభుత్వ అన్ని యాజమాన్యాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు నేషనల్ అవార్డ్స్ టు టీచర్ 2026కు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం తెలిపారు. దీనికి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అర్హులన్నారు. నేషనల్అవార్డ్స్టీచర్స్.ఎడ్యుకేషన్.గవ్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులను జూలై 10వ తేదీ వరకూ సమర్పించవచ్చన్నారు.
ప్రజా సమస్యల
పరిష్కారానికి ప్రాధాన్యం
సీటీఆర్ఐ: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 209 అర్జీలు వచ్చాయి. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అందుతున్న ఫిర్యాదులు, వినతులు కేవలం నమోదు చేయడానికే పరిమితం కాకుండా, వాటికి సత్వర పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్లో ఉన్న అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కార మార్గం చూపాలన్నారు. 1100 టోల్ఫ్రీ నంబరు ద్వారా కూడా ప్రజలు ఫిర్యాదులు చేవచ్చని తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఆదిత్యశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ పీజీఆర్ఎస్కు
30 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 30 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆయనకు సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలపై వెంటనే స్పందించి సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, సత్వరమే న్యాయం చేయాలని సూచించారు. అర్జీల్లో సివిల్, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట తదితర కేసుల గురించి ఉన్నాయి.
6 వరకు
సహకార వారోత్సవాలు
జిల్లా సహకార అధికారి వెంకటరమణ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లా వ్యాప్తంగా ‘సహకార్ సే సమృద్ధి’ అనే ప్రధాన నినాదంతో సోమవారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సహకార అధికారి ఎం.వెంకట రమణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహకార రచ్చబండలో సభ్యులు, రైతులతో సమావేశమై ఆర్థిక అక్షరాస్యత, సుస్థిర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించామన్నారు. మధ్యాహ్నం జిల్లాలోని 107 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ఒకే రోజులో 10,700 మొక్కలు నాటామన్నారు. మంగళవారం మత్స్యకార సహకార సంఘాల కార్యక్రమాలు, ఇలా 6వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు.


