ఉపాధ్యాయులకు సర్దుపోటు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు సర్దుపోటు

Jun 29 2026 12:11 AM | Updated on Jun 29 2026 12:11 AM

రాయవరం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా టీచర్ల నియామకానికి విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 20వ తేదీ నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకుని సర్దుబాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ జరుగుతూండగా.. మరోవైపు వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ పేరుతో సర్దుబాటు చేయడంపై టీచర్లు, ఉపాధ్యాయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు తగ్గడంతో ఉపాధ్యాయ పోస్టులను భారీగా సర్దుబాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులను, విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. అన్ని మండలాల్లోనూ ఉపాధ్యాయ పోస్టులు సర్‌ప్లస్‌ (మిగులు) అయ్యే అవకాశం ఉండటం ఉపాధ్యాయుల్లో గుబులు రేపుతోంది. ఈ నెల 30వ తేదీ ఎన్‌రోల్‌మెంట్‌ ప్రాతిపదికగా సర్దుబాటు ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ ఇలా..

ఫ గత ఏడాది జారీ చేసిన జీఓ–21, 33 ప్రకారం 121 మంది విద్యార్థులున్న మోడల్‌ ప్రైమరీ పాఠశాలలో ఒక హెచ్‌ఎం, ఐదుగురు ఎస్‌జీటీలను ఇచ్చారు. ఈ ఏడాది దీనిని 151 మంది విద్యార్థులకు పెంచారు. అయితే, గతంలో మాదిరిగానే 120 మంది విద్యార్థులకు 1+5 విధానం కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఫ స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) విషయానికి వస్తే ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో 10 మంది విద్యార్థులకు ఒక ఎస్‌ఏ, 11 నుంచి 30 వరకూ ఇద్దరు, 31 నుంచి 140 వరకూ నలుగురు, 141 నుంచి 175 వరకూ ఐదుగురు చొప్పున ఎస్‌ఏలు ఉండేలా సర్దుబాటు చేయాలని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు.

ఫ ఉన్నత పాఠశాలల్లో ఐదు సెక్షన్లకు జీహెచ్‌ఎం సహా 8 మంది ఎస్‌ఏలు, 6 సెక్షన్ల వరకూ 9 మంది, 7 సెక్షన్ల వరకూ 12 మంది, 8 సెక్షన్ల వరకూ 13 మంది, 9, 10 సెక్షన్ల వరకూ 15 మంది, 10, 11 సెక్షన్ల వరకూ 16 మంది, 13 సెక్షన్లకు 18 మంది, 14 సెక్షన్లకు 19 మంది చొప్పున ఎస్‌ఏలను మంజూరు చేశారు. ఈవిధంగా 25 సెక్షన్లకు జీహెచ్‌ఎంతో కలిపి 31 ఎస్‌ఏ పోస్టులు మంజూరు చేస్తారు.

ఫ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లు, జీహెచ్‌ఎంలు వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ పరిధిలోకి రారు.

నిబంధనలు సడలించాలి

ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలు సడలించాలి. ఫౌండేషన్‌, బేసిక్‌ ప్రైమరీ పాఠశాలల్లో 15 నుంచి 20 మంది విద్యార్థులుంటే కచ్చితంగా ఇద్దరు ఎస్‌జీటీలను ఇచ్చేలా ఉత్తర్వులివ్వాలి.

– చింతాడ ప్రదీప్‌ కుమార్‌,

పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు,

కాకినాడ

నూతన నిబంధనల ప్రకారం

విద్యార్థుల సంఖ్య ఆధారంగా..

ఫౌండేషన్‌ స్కూల్స్‌

విద్యార్థుల పీఎస్‌ ఎస్‌జీటీ

సంఖ్య హెచ్‌ఎం

1–20 0 1

21–60 0 2

బేసిక్‌ ప్రైమరీ స్కూల్స్‌

1–20 0 1

21–59 0 2

60–150 1 4

బేసిక్‌ ప్రైమరీ సెక్షన్స్‌ ఇన్‌ హైస్కూల్స్‌

1–10 0 1

11–30 0 3

31–59 1 3

మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌

1–20 0 1

21–39 1 2

40–59 1 3

60–150 1 4

151–180 1 5

181–210 1 6

211–240 1 7

241–270 1 8

కటాఫ్‌ డేట్‌ పెంచాలి

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 5,600 వరకూ ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో దాదాపు 18 వేల మంది ఉపాధ్యాయులున్నారు. సాధారణంగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టడం పరిపాటి. ఇతర పాఠశాలల నుంచి బదిలీలు, రిలీజ్‌ రిక్వెస్ట్‌లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే సర్దుబాటు చేపట్టడం వలన విద్యార్థులకు నష్టం జరుగుతుందనేది ఉపాధ్యాయుల వాదన. ఇప్పటికే జిల్లా విద్యా శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంఈఓలు సర్దుబాటు ప్రక్రియలో తలమునకలయ్యారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ విద్యార్థుల నమోదు ప్రాతిపదికగా వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేపట్టాలని ఉన్నతాధికారులు పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు తొలుత ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ కౌన్సెలింగ్‌ ఆదివారం జరగాల్సి ఉంది. అయితే, ఈ నెల 30వ తేదీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రాతిపదికగా తీసుకుంటే జూలై మొదటి వారంలో సర్దుబాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. తిరిగి స్పష్టమైన ఆదేశాలతో షెడ్యూల్‌ ప్రకటిస్తే, ఆ ప్రకారం ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

ఫ ఈ నెల 20వ తేదీ అడ్మిషన్ల ఆధారంగా ఉత్తర్వులు

ఫ 30వ తేదీ ప్రాతిపదికగా తీసుకోవాలని టీచర్ల డిమాండ్‌

జూలై 31 రోల్‌ అధారంగా..

అడ్మిషన్లు కొనసాగుతూండగానే అత్యవసరంగా వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేయడం తగదు. జూలై 31 నాటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టాలి. హడావుడిగా టీచర్లను సర్దుబాటు చేయడం వలన విద్యార్థులు నష్టపోయే అవకాశముంది.

– జీవీ రమణ, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement