సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసి సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ ఆ పార్టీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యాన మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. గోదావరి గట్టున శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ఈ హోమం జరిగింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, హైదరాబాద్లోని ఆసుపత్రిలో ముద్రగడ చికిత్స పొందుతున్నారని, ఆయనకు అందుతున్న వైద్య సేవలపై ప్రజలు ఎటువంటి అపో హా పడవద్దని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రముఖ సూపర్ స్పెషలిస్ట్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, నీతి నిజాయితీ గల నాయకుడుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం ఆయురారోగ్యాలతో క్షేమంగా ఇంటికి తిరిగి చేరుకోవాలని ఈ హోమం నిర్వహించామని అన్నారు.


