చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. లారీని తప్పించబోయి రహదారి పక్కకు దూసుకుపోయి ఆగింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చింతూరు మండలం తులసిపాక సమీపంలోని ఘాట్ రోడ్డులో వనదుర్గ ఆలయం వద్ద శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వెళుతున్న బస్సు వనదుర్గ ఆలయం వద్ద ఉన్న కల్వర్టు సమీపానికి రాగానే, ఎదురుగా లారీ అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఎడమ వైపునకు తిప్పడంతో పక్కనే ఉన్న మట్టిలోకి దూసుకుపోయి పాత రహదారి వద్ద నిలిచిపోవడంతో బస్సులోని 40 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టు లేదా, ఎదురుగా ఉన్న లోయలోకి దూసుకెళ్లినా ప్రమాద తీవ్రత అధికంగా ఉండేది. వనదుర్గ ఆలయం వద్ద ఉన్న కల్వర్టు ఇరుకుగా ఉండడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సులోని ప్రయాణికులను కాకినాడ డిపోకు చెందిన మరో బస్సులో పంపించారు.


