రాజానగరం: దివాన్చెరువులోని జాతీయ రహదారుల (ఎన్హెచ్ ఏఐ) కార్యాలయ భవనాన్ని ఎంజీ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు అటాచ్మెంట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు అమీనా సమక్షంలో మంగళవారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కొవ్వూరు నుంచి గుండుగొలనుకు ఉన్న మార్గంలో ఈ సంస్థకు ఉన్న మూడు ఎకరాల భూమిని అధికారులు తీసుకున్నారు. అయితే ఆ భూమికి సంబంధించిన పరిహారాన్ని చెల్లించడంలో తీవ్ర జాప్యం జరగడంతో ట్రస్టు ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిదేళ్లుగా జరుగుతున్న ఈ సమస్య పై చివరకు కోర్టు ఎన్హెచ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మనీ డిక్రీ అమలుకు ఆదేశాలిచ్చింది. దీంతో దివాన్చెరువులో ఆర్ఎస్ నం.560/3లో 2.110 ఎకరాలలో ఉన్న ఎన్హెచ్ కార్యాలయ భవనాన్ని, ప్రాంగణాన్ని అటాచ్మెంట్ (జప్తు వరకు వెళ్లకుండా సమస్య పరిష్కారానికిగాను ప్రాథమికంగా తీసుకునే చర్య) చేస్తూ, ఎటువంటి క్రయ, విక్రయాలు సాగించడానికి వీలులేదంటూ నోటీసు బోర్డులను కూడా ఏర్పాటుచేశారు.


