అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రద్దీ నెలకొంది. స్వామి, అమ్మవార్లను అర్చకులు వివిధ రకాల పువ్వులతో సుందరంగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉదయం ఉచిత ప్రసాదాల పంపిణీతో పాటు 10 గంటల నుంచి అన్నసమారాధన జరిపారు. మండలంలోని కడింపాడు గ్రామానికి చెందిన వేండ్ర పెద్ద శక్తిరాజు, కొండారత్నం దంపతుల కుమారులు కలసి అన్నదానం నిర్వహించారు. సుమారు 14 వేల మంది భక్తులు స్వామి ప్రసాదాలను స్వీకరించారని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు
పటిష్ట బందోబస్తు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, డ్రోన్, సోలార్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశించారు. ఆయన శనివారం పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. విద్యార్థులు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలకు తీసుకెళ్లకుండా తనిఖీలు చేయాలని, పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలన్నారు.
గోదావరి పుష్కరాలకు
ముందస్తు సన్నాహాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): 2027లో జరిగే గోదావరి మహా పుష్కరాలకు జిల్లా స్థాయిలో సమగ్ర సన్నాహక చర్యలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ కీర్తి అన్నారు. ఆమె శనివారం తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. దీనికి ఎస్పీ డి.నరసింహ కిశోర్, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పార్కింగ్ స్థలాలు, పుష్కర నగర్ల కోసం అవసరమైన ల్యాండ్ గుర్తింపుపై ఏడు రోజుల్లోగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలన్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలకు తగిన పార్కింగ్ స్థలాలను గుర్తించడంతో పాటు, గుర్తించిన ప్రదేశాల్లో ఎన్ని బస్సులు నిలిపి ఉంచవచ్చో కచ్చితంగా లెక్కించాలన్నారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
ఉత్సాహంగా ‘తెలుగునుడి’
రాజమహేంద్రవరం రూరల్: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపకులపతి ఆచార్య డి.మునిరత్నం నాయుడు అధ్యక్షతన శనివా రం ‘తెలుగునుడి’ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యక్షుడు రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ అంతర్యామి వ్యవస్థాపకులు బీవీఎన్ఎస్ మూర్తి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మాతృభాషలో పరిజ్ఞానం లేకుండా పర భాష నేర్చుకుంటే ప్రయోజనం ఉండదన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఆచార్య ముని రత్నం నాయుడిని రాకా సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి జీవీ రమణ, కోశాధికారి సూరపురెడ్డి తాతారావు సత్కరించారు. సమన్వయ కర్త చిలుకోటి కూర్మయ్య స్వాగతం పలకగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేవీ రామకృష్ణ వందన సమర్పణ చేశారు. విజయ శంకర ప్రభు త్వ సంగీత నృత్య పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పసుమర్తి శ్రీనివాస శర్మ పాల్గొన్నారు.
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు


