‘ఏయ్ ఎవరు నువ్వు.. ఏం తీస్తున్నావ్’
సాక్షి, రాజమహేంద్రవరం: పైకి పొత్తులు.. లోపల కత్తులు మాదిరిగా టీడీపీ, జనసేన నాయకుల తీరు ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ వివాదాలను వారిలో వారు రహస్యంగా పరిష్కరించుకుంటే ఏ సమస్యా ఉండదు. కానీ బహిరంగంగా గొడవలు పడడం, వాటిని వెలుగులోకి తెచ్చే విలేకరిపై విరుచుకుపడడం దారుణం. సాక్షాత్తూ ఒక ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
వివరాలు ఇవీ..
రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్లో మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శనివారం ప్రెస్మీట్ నిర్వహించారు. అనంతరం మంత్రి దుర్గేష్ స్టేజ్ దిగి వెళుతుండగా జనసేన నేతలు అడ్డుకున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో జనసేన నేతలకు టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, సమావేశాలకు ఆహ్వానించడం లేదని తెలిపారు. దీంతో దుర్గేష్, ఎమ్మెల్యేలు సదరు జనసేన నేతలతో మంతనాలు జరిపారు. ఎన్నో రోజుల నుంచి సమస్య ఉన్నా.. పరిష్కరించడం లేదని జనసేన నేతలు పెద్దగా అరవడం మొదలు పెట్టారు. దీంతో పక్కనున్న జర్నలిస్టులు అక్కడికి చేరుకున్నారు. కూటమి నేతలు, మంత్రి, ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న వాగ్వాదాన్ని ఓ దినపత్రిక విలేకరి ఫొటో తీస్తుండగా.. గమనించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఒక్కసారిగా ఆ విలేకరిపై విరుచుకుపడ్డారు. ‘ ఏయ్ ఎవరు నువ్వు.. ఏం తీసుస్తున్నావ్.. ఏంటి నీ కథ’ అంటూ రెచ్చిపోయారు. ఒకానొక దశలో దాడి చేసే పరిస్థితికి వచ్చారు. చేయి చూపించి మరీ బెదిరింపులకు దిగారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే అనుచరుడు ఆ విలేకరి ఫోన్ లాక్కున్నాడు. తీసిన ఫొటోలను డిలిట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో మిగిలిన విలేకరులందరూ ఒక్కసారిగా అక్కడికి చేరుకుని ఫోన్ లాక్కున్న కార్యకర్త వద్ద ఫోన్ తీసుకున్నారు. ఫోన్ ఎందుకు తీసుకున్నావంటూ ప్రశ్నించారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి దుర్గేష్ కలగజేసుకుని విలేకరులకు సద్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో ఎమ్మెల్యే మద్దిపాటి అక్కడి నుంచి జారుకున్నారు.
విలేకరిపై విరుచుకుపడిన
ఎమ్మెల్యే మద్దిపాటి
కూటమి నేతల గొడవను
ఫొటో తీస్తుండగా బెదిరింపులు
ప్రతిఘటించిన మిగిలిన జర్నలిస్టులు
నచ్చజెప్పిన మంత్రి కందుల దుర్గేష్


