
ముమ్మిడివరం: మోటారు సైకిల్పై వస్తున్న నలుగురు యువకులను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయ పడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన ఉందుర్తి బాలు, కరప మండలం గొల్లపాలెంకు చెందిన ఖండవిల్లి రాజా, అయినవిల్లి మండలం శంకరాయగూడెంకు చెందిన నిడుమోలు ఉమామహేశ్వరరావు, టి.కొత్తపల్లికి చెందిన బొమ్మి వినోద్ ఆదివారం యానాం నుంచి ఒకే మోటారు సైకిల్పై తిరిగి వస్తుండగా 216 జాతీయ రహదారి అన్నంపల్లి టోల్ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉమామహేశ్వరరావును ఇంటి దగ్గర దింపేందుకు వారు వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన వారిలో ఉందుర్తి బాలు పరిస్ధితి ఆందోళన కరంగా ఉంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురికి తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం