పాము కాటు లక్షణాలు ఇవీ..
● తీవ్రమైన జ్వరంతో పాటు రక్తపోటు రావచ్చు.
● భరించలేని నొప్పి, కనురెప్పలు మూతపడడం.
● కాటు పడిన చోట వాపు రావడం, శరీరం పాలిపోవడం.
ఆలమూరు: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలే అత్యధికంగా ఉండడంతో సహజంగానే పాముల వంటి విష కీటకాల బెడద సహజంగానే ఉంటుంది. పొలాలు, మొక్కలు, తుప్పలు పేరుకుపోయిన ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా తారసపడుతుంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు చేసుకునే వారు, పాదచారులు సహజంగానే వాటి కాట్లకు గురవుతుంటారు. కాటు వేసి తప్పించుకునే పాము ఏ స్థాయి విషపూరితమైనదో తెలియదు. అందువల్ల చిన్న పాము కాటును సైతం సంప్రదాయ చికిత్స కాకుండా సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు అంతర్జాతీయ పాముకాటు అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వైద్యశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తోంది. పాము కాట్ల నుంచి రక్షించే వ్యాక్సిన్ ఏఎస్వీ (యాంటీ స్నేక్ వీనమ్)ని 1895లో ప్రాన్స్కు చెందిన ఫిజీషియన్ ఆల్బెర్ట్ కాల్మెట్టే కనుగొన్నారు. ఇది దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటుంది. పాముకాట్ల కేసుల్లో దేశంలో రెండో స్థానంలో ఉన్న మన రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాలుగో స్థానంలో ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 23 ప్రభుత్వ, ఏరియా ఆస్పత్రులోను, 158 పట్టణ, గ్రామీణ పీహెచ్సీలలో దీనిని అందుబాటులో ఉంచారు. ఇటీవలి కాలంలో 108 వాహనాల్లో సైతం ఉంచుతున్నారు. ఏటా సుమారు 500 మంది వరకూ పాముకాట్లకు గురవుతుండగా సకాలంలో చికిత్స అందక సుమారు పది శాతం మంది మృత్యువాత పడుతున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 350 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు.
జాతిని బట్టి ప్రాణాపాయం
సాధారణంగా కోస్తా జిల్లా పరిసరాల్లో అనేక విష సర్ప జాతులు ఉన్నా కట్లపాము, రక్త పింజర, తాచు పాము, పొడపాము కాట్ల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రక్తపింజర కాటు వేస్తే రెండు గంటల తరువాత, తాచుపాము కాటు వేస్తే అరగంటలో, కట్లపాము కాటు వేస్తే నిమిషాల వ్యవధిలో విషం శరీరమంతా పాకి ప్రాణాపాయానికి అవకాశం ఉంది.
ఆలస్యమైతే ప్రాణాపాయం తప్పదు
సంప్రదాయ వైద్యం, చికిత్సలు వద్దు
అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఏఎస్వీ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25వ తేదీ వరకు అంతర్జాతీయ పాముకాటు
అవగాహన వారోత్సవాలు
వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి
పాముకాటుకు గురైన వ్యక్తులు మనోస్థైర్యాన్ని కోల్పోకుండా వీలైనంత త్వరగా చికిత్స అందజేయాలి. అన్ని ఆస్పత్రులలోనూ ఏఎస్వీ వ్యాక్సిను అందుబాటులో ఉన్నాయి.
– ఎం.దుర్గారావు దొర,
జిల్లా వైద్యారోగ్యశాఖ, అమలాపురం
తీసుకోవలసిన జాగ్రత్తలు
కాటు పడిన వెంటనే సబ్బునీటితో కడగాలి
కాటు వేసిన మూడు గంటలలోపు ఏఎస్వీ వేయించి వైద్యం అందించాలి.
వ్యవయాయ క్షేత్రాల్లో పనిచేసే వారు పాదరక్షలు ధరించాలి.
పెస్ట్ కంట్రోల్ వినియోగించడం ద్వారా పాముల సంచారాన్ని అరికట్టవచ్చు.


