● ‘ఎక్స్’లో మంత్రి లోకేష్ పరోక్ష పోస్టుపై ప్రజల ఆగ్రహం
● అసహనం వ్యక్తం చేస్తున్న
పోలీసు అధికారులు
అమలాపురం టౌన్: వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజే శబ్దాలకు పలువురు గెండెలు ఆగి చనిపోతున్నారు. డీజేలపై పోలీసు ఆంక్షలు ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధుల అండతో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ ఖాతాలో ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి కోరుతూ మెసేజీలు వస్తున్నాయని, హోం మంత్రి అనితను డీజేలకు ఓకే చెప్పాలని సూచిస్తూ పోస్టు పెట్టడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లలో ఇటువంటి ఊరేగింపుల్లో డీజేల వల్ల ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే అపరిమిత శబ్దం వల్ల ఓ వ్యక్తి దుర్మణం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ పోస్టును ఉద్దేశించి ఇలాగైతే తాము డీజేలను అదుపు చేయలేమని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’ వద్ద అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
ఇది బాధ్యతా రాహిత్యమే
డీజే శబ్దాలతో పలువురి ప్రాణాలు పోతుంటే మంత్రి లోకేష్ బాధ్యతారాహిత్యంగా అనుమతులు ఇవ్వడం సరికాదు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది పోయి ఇలా తప్పుడు పోస్టులు, ప్రకటనలు చేయడం దేనికి సంకేతం? ఓటు బ్యాంక్ రాజకీయాలతో మంత్రి లోకేష్ డీజేలకు అనుమతులు ఇవ్వాలని అభిప్రాయపడడమే కాకుండా దాని అమలుకు కసరత్తు చేయడం బాధాకరం.
– కాశి రామకృష్ణ,
జిల్లా అధికార ప్రతినిధి, వైఎస్సార్ సీపీ


