ఫ జిల్లాలో ఆచూకీ లేని ఓటర్లతో ఇబ్బంది
ఫ ఇంకా 42,484 ఫారాలు
బీఎల్ఏల చెంతనే
ఫ మిగిలింది మూడు రోజులే గడువు
సాక్షి, అమలాపురం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)కు డిజిటలైజేషన్ గడువు దగ్గర పడుతుంది. జిల్లాలో ఇంకా వేలాది మంది ఓటర్ల ఆచూకీ బూత్ లెవిల్ ఆఫీసర్లు (బీఎల్ఏ)కు తెలియకుండా పోయింది. ఇందులో కొంతమంది మృతిచెందిన వారు కాగా.. మిగిలిన వారు ఇళ్లు మారిన, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. సర్ ప్రక్రియలో డిజిటలైజేషన్కు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆ ఓటర్ల ఆచూకీ కోసం బీఎల్ఏలు సతమతం అవుతున్నారు.
సర్ జిల్లా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ చివరి దశకు చేరుకున్నా, గుర్తించలేని ఓటర్లు ఎన్నికల యంత్రాంగానికి కొత్త సవాల్గా మారారు. జిల్లాలో మొత్తం 42,484 మంది ఓటర్లకు చెందిన యూఈఎఫ్లు (సేకరించలేని ఎన్యూమరేషన్ ఫారాలు) ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఎక్కువ మంది మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉన్నవారు లేదా ఇల్లు మారిన వారు.. వివాహాలు చేసుకుని అత్తవారింటికి వెళ్లినవారు ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. వీరి వివరాలు సేకరించేందుకు బూత్ స్థాయి అధికారులు, బూత్ లెవిల్ ఏజెంట్లు మరోసారి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 1,421 పోలింగ్ స్టేషన్లు ఉండగా, మొత్తం ఓటర్లు 13,15,007 మంది ఉన్నారు. ఇందులో శనివారం ఉదయం 8 గంటల వరకు 11,26,432 ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. శనివారం ఒక్కరోజే మరో 35,699 ఫారాలు నమోదు కావడంతో సాయంత్రం ఆరు గంటల సమయానికి మొత్తం 11,62,131 ఫారాలు డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. ప్రస్తుతం 1,52,876 ఫారాలు ఇంకా పెండింగ్లో ఉండగా, జిల్లా డిజిటలైజేషన్ శాతం 88.37గా నమోదైంది. సాయంత్రం సమయానికి ఇది మరింత పెరగనుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో పురోగతి ఆశించినంత వేగంగా లేకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం బయటకు వెళ్లిన ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల అమలాపురం, ముమ్మిడివరం వంటి పట్టణ ప్రాంతాల్లో ఫారాల సేకరణ మందగించింది. దీనితో పాటు రావులపాలెం, అమలాపురం రూరల్, కె.గంగవరం, ఆలమూరు వంటి మండలాల్లో ఆచూకీ తెలియని ఓటర్లు అధికంగా ఉన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం వల్ల డిజిటలైజేషన్ వేగంగా కొనసాగుతోంది.
మండలాల వారీగా గుర్తించని
ఓటర్ల వివరాలు
మండలం యూఈఎఫ్లు
రామచంద్రపురం (అర్బన్) 2,057
రామచంద్రపురం రూరల్ 1,944
కాజులూరు 1,491
కె.గంగవరం 2,447
ముమ్మిడివరం (రూరల్) 1,244
ముమ్మిడివరం (అర్బన్) 753
కాట్రేనికోన 1,670
ఐ.పోలవరం 1,856
తాళ్లరేవు 2,410
అమలాపురం (రూరల్) 1,746
అమలాపురం (అర్బన్) 1,509
అల్లవరం 2,200
ఉప్పలగుప్తం 1,026
సఖినేటిపల్లి 1,901
మలికిపురం 1,424
రాజోలు 2,465
మామిడికుదురు (రాజోలు) 736
మామిడికుదురు (పి.గన్నవరం) 1,044
పి.గన్నవరం 1,930
అంబాజీపేట 1,562
అయినవిల్లి 681
అత్రేయపురం 1,181
రావులపాలెం 3,258
కొత్తపేట 1,720
ఆలమూరు 2,229
మొత్తం 42,484
అగ్రస్థానంలో అంబాజీపేట
జిల్లాలో డిజిటలైజేషన్లో అంబాజీపేట మండలం 93.25 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో రామచంద్రపురం అర్బన్ 92.77 శాతం, మూడో స్థానంలో రామచంద్రపురం రూ.92.31 శాతంలో ఉన్నాయి. నాలుగో స్థానం పి.గన్నవరం 91.68, ఐదో స్థానం మామిడికుదురు 90.73 శాతం సాధించాయి. అయితే కాట్రేనికోన మండలం 77.97 శాతంతో జిల్లాలో అత్యల్పంగా ఉంది. సర్ ప్రక్రియ ముగియడానికి మరో మూడు రోజులు మిగిలి ఉండటంతో పెండింగ్ ఫారాల సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. యూఈఎఫ్లకు సంబంధించిన ఓటర్ల ఆచూకీ కనుగొని, వీలైనంత త్వరగా డిజిటలైజేషన్ పూర్తి చేయడమే ప్రస్తుతం ఎన్నికల యంత్రాంగం ముందున్న ప్రధాన లక్ష్యంగా మారింది.


