నిరసనలు చేపట్టాలని నిర్ణయం
అమలాపురం టౌన్: రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, జీఓ నంబరు 396ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ డాక్యుమెంట్ రైటర్లు (దస్తావేజు లేఖర్లు) కొంత కాలంగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసనలు ఉధృతం చేసేందుకు లేఖర్లు సిద్ధమయ్యారు. ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకూ పెన్డౌన్ చేసి ఆందోళలు చేపట్టాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెందిన దస్తావేజు లేఖర్లు సిద్ధమవుతున్నారు. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు శనివారం సమావేశమై 20వ తేదీ నుంచి చేపట్టనున్న పెన్డౌన్ నిరసనలపై చర్చించారు. తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు. జీఓ 396 అమలైతే దస్తావేజు లేఖర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు జిన్నూరి సురేష్, గౌరవాధ్యక్షుడు గుంటు ఫణిప్రసాద్, కన్వీనర్ మట్టపర్తి రాము, కార్యదర్శి పెద్దిరెడ్డి దుర్గేష్, ఉపాధ్యక్షుడు వెలుతుపల్లి వెంకట సుబ్బారావు, సంఘ సభ్యులు పందిరి శ్రీహరి, కేవీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


