ఆత్రేయపురం: శ్రీనివాసా.. శ్రీవేంకటేశా నామస్మరణ మార్మోగింది. శనివారం కావడంతో వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయం కిక్కిరిసింది. ఈ ఒక్క రోజు సుమారు లక్ష మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా. ఏడు శనివారాలు స్వామివారి దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలంగా భక్తులు విశ్వసించి తరలివస్తున్నారు. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి పూజలను ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. భక్తులు విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఆలయ ఆవరణలో అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారిని కొలిచారు. భక్తుల వసతుల కల్పనకు, ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణకు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు సహకరించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.


