● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరుబాట
● నిరుద్యోగులకు అండగా పార్టీ శ్రేణులు
● అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్
అమలాపురం రూరల్: ఇది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని.. అర్హులను అనర్హులుగా మార్చి నిరుద్యోగులను మోసం చేసిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు పోరుబాటకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలపై సోమవారం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద జిల్లా వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, ఎస్సీసెల్ ప్రతినిధులు భారీఎత్తున తరలివచ్చారు. తొలుత స్థానిక నల్ల వంతెన వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల కోఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ చింతా అనురాధ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్ గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. తర్వాత ముఖ్య నాయకులకు అనుమతి ఇవ్వడంతో డీఎస్సీ నియామకాల్లో జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ కలెక్టర్ మహేష్ కుమార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, అమలాపురం, రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల కోఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, పిల్లి సూర్యప్రకాష్, గన్నవరపు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అనేక అక్రమాలు జరగడంతో నిరుద్యోగ యువత నష్టపోయారన్నారు. అర్హత, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం, నియామక ప్రక్రియను వివాదాస్పదం చేసి, వేలాది మంది భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. దీనిపై ప్రభుత్వం సీబీఐ విచారణ చేయాలన్నారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో అనేక అవకతవకలు జరిగాయని, అర్హత లేని కొందరికి ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అనర్హులకు ప్రాధాన్యం కల్పించారన్నారు. క్రీడా కోటా నియామకాల్లో అవినీతి జరిగిందన్నారు. మెరిట్ లిస్టును కలెక్టరేట్లో ఎందుకు ప్రచురించలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శులు సరేళ్ల రామకృష్ణ, పలివెల సుధాకర్, సోషల్ మీడియా కార్యదర్శి ఉండ్రు బాబ్జీ, జిల్లా అధికారి ప్రతినిఽధి కాశీ రామకృష్ణ, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సాధనాల శ్రీను, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు ములపర్తి శ్రీను, జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత సాకా ప్రన్నకుమార్, జెడ్పీటీసీ పందిరి శ్రీహరి రామ్గోపాల్, ఆయా మండలాల అధ్యక్షులు బద్రి బాబ్జీ, గుత్తుల చిరంజీవిరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గెడ్డం కిరణ్, జిల్లా పార్టీ కార్యదర్శి కముజు రమణ, నియోజకవర్గ, మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు నక్కా చంద్రశేఖర్, చెట్ల రామారావు, రేవు శ్రీను, పోతుముడి కొండబాబు, పినిపే జయరాజు, దాసరి అరుణకుమారి, డేవిడ్, కడిమి చిన్నవరాజు, సాపే సత్యనారాయణ, యర్రంశెట్టి రామచంద్రరావు, ముత్యాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కోఆర్డినేటర్లు డాక్టర్ శ్రీకాంత్, శ్రీనివాసరావు, మాజీ ఎంపీ అనురాధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు డేవిడ్రాజు
కలెక్టర్కు వినతిపత్రం అందిస్తున్న జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు,
కోఆర్డినేటర్లు డాక్టర్ శ్రీకాంత్, శ్రీనివాసరావు


