అమలాపురం రూరల్: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో భాగంగా డిజిటల్ ప్లాట్ఫారం ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్ను ప్రభుత్వం తీసుకువచ్చిందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ యాప్ ద్వారా ఎరువులు బుకింగ్, బ్లాక్ మార్కెటింగ్కు చెక్ పెట్టవచ్చన్నారు. జిల్లాకు 16 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 7,900 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 59, 600 మంది కౌలు రైతులు ఉన్నారన్నారు.
● బీఎల్వో యాప్ సాంకేతిక శిక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ ప్రసంగిస్తూ ఈ యాప్ వినియోగంపై పూర్తి స్థాయి సాంకేతిక శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు, నియోజకవర్గ ఎన్నికల అధికారులు జి.మమ్మీ, డి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పుష్కరాలకు వసతి
ప్రణాళిక సిద్ధం చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా జిల్లాకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులు, అధికారులు, సేవా సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాల కల్పన కోసం ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, పాఠశాలలు, కళాశాలలు, కల్యాణ మండపాలు, సత్రాలు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీ స్థలాలు తదితర వసతి కేంద్రాలను గుర్తించి వాటి సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలపై సమాచారం సేకరించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీతానగరం మండల
పరిధిలో పులి సంచారం
సీతానగరం: మండల పరిధిలోని పురుషోత్త పట్నం పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సోమవారం ఉదయం జీపీఎస్ ట్రాకింగ్తో పులి దేవీపట్నం మండలం నేలకోట, సీతానగరం మండల పరిధిలోని రామదుర్గం కొండ, రామరపు ఆవ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. ఆదివారం రాత్రి దేవీపట్నం మండల పరిధిలో 14 పశువులను చంపి, సోమవారం సీతానగరం మండల పరిధిలోని కొండలు, పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించింది. నాగంపల్లి, చీపురుపల్లి, అచ్చయ్యపాలెం, చినకొండేపూడి, పెద్దకొండేపూడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ ఎ.శ్రీనివాస్ సూచించారు.


