అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే, సంబంధిత అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి, డీఆర్వో బి.సుబ్బారావు ప్రజల నుంచి సుమారు 210 అర్జీలను స్వీకరించారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ తెలిపారు.
పోలీస్ గ్రీవెన్స్కు 19 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 19 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలుచోట్ల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలపై ఎస్పీ మీనాకు ఫిర్యాదు చేశారు. వాటిపై ఎస్పీ మీనా జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి సమస్యల పరిష్కారానికి సీఐ, ఎస్సైలకు పలు సూచనలు ఇచ్చారు. వచ్చిన అర్జీల్లో ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. కొందరు ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి సమస్యల పరిష్కారానికి ఎస్పీ ప్రయత్నించారు. గ్రీవెన్స్ పర్యవేక్షణ ఎస్సై గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.


