వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలగుంపు | Telangana: Elderly woman mauled to death by stray dogs in Rajanna sircilla district | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలగుంపు

Aug 2 2024 5:42 AM | Updated on Aug 2 2024 5:42 AM

Telangana: Elderly woman mauled to death by stray dogs in Rajanna sircilla district

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం

ముస్తాబాద్‌ (సిరిసిల్ల): వీధికుక్కలు జవహర్‌నగర్‌లో బాలు డిని చంపిన ఘటన మరువకముందే మ రో దారుణం చోటు చేసుకుంది. అచేతన స్థితిలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై కుక్కలగుంపు దాడి చేసి ప్రాణాలు తీశాయి. తలను పీకి.. పొట్టను చీల్చి పేగులు, కా లే యాన్ని తినేశాయి.

ఈ  దారుణ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం బట్టోనితాళ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. బట్టోనితాళ్లకు చెందిన పిట్ల రామలక్ష్మి(85) ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడిచేసి ముఖాన్ని కొరుక్కుతిని, పొట్టను చీల్చాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఎదురుతిరగలేని పరిస్థితిలో ప్రాణాలు విడిచింది. రామలక్ష్మి ము ఖం పూర్తిగా ఛిద్రమై ఎముకలు తేలాయి. ఆమె పడుకున్న మంచంలోనే ప్రాణాలు వదలగా, రక్తం ధారలు కట్టింది.  

వేర్వేరు ఇళ్లలో కొడుకులు 
రామలక్ష్మి ముగ్గురు కుమారులు బాలరాజు, దేవయ్య, అంజయ్యలు వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో పొద్దంతా పనులకు వెళ్లి వచ్చినవారు బుధవారం రాత్రి గాఢనిద్రలోకి జారుకున్నారు. రామలక్ష్మి తనకున్న ప్రత్యేక గదిలో నిద్రించింది. ఆ గదికి సరైన తలుపులు లేకపోవడంతో రాత్రివేళ కుక్కలు దాడి చేశాయి.

మంచంలో ఎంత గింజుకున్నా, కుక్కలు వదల్లేదని అక్కడున్న పరిస్థితులను బట్టి తెలుస్తోంది. అందరూ నిద్రలో ఉండడంతో ఆమె కేకలు ఎవరికీ వినిపించలేదు. గురువారం ఉదయం రామలక్ష్మి కుటుంబీకులు జరిగిన సంఘటన చూసి బోరున విలపించారు. మృతురాలి గదంతా రక్తసిక్తమై, శరీర భాగాలు పడి ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement