ఏ కడుపున పుట్టాడో ఆ తల్లినే... | Srikakulam: Son Assassinated Mother And Father Over Mentally Disorder | Sakshi
Sakshi News home page

ఏ కడుపున పుట్టాడో ఆ తల్లినే...

Jun 9 2022 10:29 AM | Updated on Jun 9 2022 10:36 AM

Srikakulam: Son Assassinated Mother And Father Over Mentally Disorder - Sakshi

సంఘటన స్థలాన్ని క్లూస్‌టీమ్‌తో పరిశీలిస్తున్న సీఐ వినోద్‌బాబు

అమ్మ పంచిన సంతోషం మరిచిపోయాడు. గొడవలు మాత్రం గుర్తు పెట్టుకున్నాడు. నాన్న ఇచ్చిన జీవితం మర్చిపోయాడు. కోపతాపాలు మాత్రం మెదడు నిండా నింపుకున్నాడు. తల్లి చేసిన త్యాగాలు, తండ్రి ఇచ్చిన తోడ్పాటు ఏవీ గుండెల్లో పెట్టుకోలేదు. వారితో వచ్చిన కాసిన్ని మాట పట్టింపులతో మనసును చేదు చేసుకున్నాడు. పెరిగిపోయిన మానసిక సమస్యకు తాగుడు ఆజ్యం పోసింది. ఇంకేముంది మనిషి మృగంలా మారిపోయాడు. తన జన్మకు కారణమైన తల్లిదండ్రులపై కత్తిదూశాడు. ఏ కడుపున పుట్టాడో ఆ తల్లి ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు. ఏ రక్తం పంచుకున్నాడో ఆ తండ్రిని మరణం అంచుల వరకు తీసుకెళ్లాడు. 

సాక్షి, పాతపట్నం(శ్రీకాకుళం): పాతపట్నం మండలం కాపుగోపాలపురంలో బూసి శ్రీనివాసరావు అనే వ్యక్తి తన తల్లి భగవతమ్మ(65)ను మంగళవారం అర్ధరాత్రి కర్కశంగా నరికి చంపేశాడు. ఈ దాడిలో తండ్రి రామారావు తీవ్రంగా గాయపడి ప్రాణాల కోసం పోరా డుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కాపు గోపాలపురం గ్రామంలో బూసి రామారావు, బూసీ భగవతమ్మ దంపతు లకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

పెద్ద కుమారుడు బూసి శ్రీనివాసరావు సీఆర్‌పీఎఫ్‌లో పనిచేసి రిటైరై పాతపట్నంలోని సాయి నగర్‌లో నివసిస్తున్నాడు. రెండో కుమారుడు బూ సి లోకేశ్వరరావు హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో పనిచేసుకుంటున్నాడు. మూడో కుమారుడు బూసి జగదీశ్వరరావు జవాన్‌గా ఢిల్లీలో పనిచేస్తున్నాడు. కుమార్తె జ్యోతి పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావుకు అతని భార్య కల్యాణికి మధ్య మనస్ఫర్థలు ఉన్నాయి. వీరు తరచూ గొడవపడేవారు. శ్రీనివాసరావు మానసిక స్థితి బాగుండేది కాదు. తల్లిదండ్రులతోనూ నిత్యం తగాదా పడేవాడు.  

అందరూ పడుకున్నాక.. 
శ్రీనివాసరావు మంగళవారం రాత్రి తప్పతాగి కాపుగోపాలపురంలోని తల్లిదండ్రుల ఇంటి వ ద్దకు వచ్చాడు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో కత్తి, కర్ర తీసుకుని తల్లిదండ్రులపై కర్కశంగా దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి భగవతమ్మ అక్కడికక్కడే కన్నుమూశారు. రామారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగాక తెల్లవారు జామున శ్రీనివాసరావే మరో వ్యక్తికి ఫోన్‌ చేసి తల్లిని చంపేశానని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పగా.. వారు వచ్చి చూసేసరికి భగవతమ్మ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. పక్కనే రామారావు తీవ్ర గాయాలతో ఉన్నారు.

దాడికి పాల్ప డిన కత్తిని శ్రీనివాసరావు ఇంటి పెరట విసిరేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సీఐ ఎం.వినోద్‌బాబు, ఎస్‌ఐ మహ్మర్‌ అమీర్‌లు సంఘటనా స్థలానికి వెళ్లారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షత గాత్రుడిని అంబులెన్స్‌లో పాతపట్నం సీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తె లుసుకున్న కాశీబుగ్గ డీఎస్సీ శివరామిరెడ్డి, క్లూస్‌ టీమ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భగవతమ్మ మృతదేహన్ని పాతపట్నం సీహెచ్‌సీ తరలించి, పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భగవతమ్మ మృతితో కాపుగోపాలపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

చదవండి: హమ్మ తొండా.. ఎంత పనిచేశావే!

   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement