సింధూజ మృతదేహం కర్నూలులో లభ్యం | Sindhuja body was found in Kurnool | Sakshi
Sakshi News home page

సింధూజ మృతదేహం కర్నూలులో లభ్యం

Jul 28 2020 5:04 AM | Updated on Jul 28 2020 7:36 AM

Sindhuja body was found in Kurnool - Sakshi

సింధూజ (ఫైల్‌)

కర్నూలు: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలో కలుగొట్ల దగ్గర వాగులో కొట్టుకుపోయిన వైఎస్సార్‌ జిల్లాకి చెందిన యువతి సింధూజ (26) మృతదేహం కర్నూలులో బయటపడింది. వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శివశంకర్‌రెడ్డి, సింధూజలకు ఏడాది క్రితం వివాహమైంది. శివశంకర్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాగా..సింధూజ గృహిణి. మిత్రుడు జిలానీ బాషాతో కలిసి వీరు ఈ నెల 25న బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు.

కర్నూలు దాటిన తరువాత హైవే దిగి అడ్డదారిలో పుల్లూరు, కలుగొట్ల మీదుగా ప్రయాణం సాగించారు. కలుగొట్ల శివారులోని వాగులో నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక అలాగే వెళ్లడంతో కారు మధ్యలో నిలిచిపోయింది. జిలానీ, శివశంకర్‌రెడ్డిలు కారు దిగి ఒడ్డుకు చేరుకోగా, వెనుక సీటులో నిద్రిస్తున్న సింధూజ నీటిలో కొట్టుకుపోయింది.  సింధూజ కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది.

కర్నూలు అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్‌ నేతృత్వంలో పది మంది బృందాలుగా ఏర్పడి 2 కిలోమీటర్ల పొడవునా తుంగభద్ర నదిలో పుట్టీల ద్వారా గాలించారు. సోమవారం సాయంత్రం తుంగభద్ర నది రైల్వే బ్రిడ్జి సమీపంలో సింధూజ మృతదేహం లభించింది.
  

Advertisement
 
Advertisement
Advertisement