మొదట మాటు వేసి.. ఆపై మెల్లగా మాటలు కలిపి

Man Who Cheated Old Citizens Bank Got Arrested Hyderabad - Sakshi

సాక్షి, తలకొండపల్లి: బ్యాంక్‌ల వద్ద వృద్ధులకు మాయమాటలు చెప్పి డబ్బు కాజేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ వరప్రసాద్‌ సోమవారం మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించాడు. మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన రాములు(27) గత కొంతకాలంగా పరిసర మండలాల్లోని బ్యాంక్‌ల వద్ద మాటు వేసి మోసాలకు పాల్పడుతున్నాడు.

బ్యాంక్‌ల వద్దకు వచ్చిన వృద్ధులను మచ్చిక చేసుకొని డబ్బులు విత్‌డ్రా చేసి ఇస్తానని ఓచర్లు రాసి మోసం చేసేవాడు. డబ్బులు డ్రా అయిన తర్వాత లెక్కబెట్టి ఇస్తానని చెప్పి పారిపోయేవాడు. మండల కేంద్రంలోని ఏపీజీవీ బ్యాంక్‌ వద్ద గత నెల 28న పెంటయ్య అనే వృద్ధుడికి మాయమాటలు చెప్పి రూ.10 వేలు తీసుకుని పారిపోయాడు. పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా హెడ్‌ కానిస్టేబుల్‌ రవీందర్, మరో ముగ్గురు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టి సోమవారం ఎల్లమ్మతండాలో నిందితుడిని అరెస్టు చేసి కల్వకుర్తి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై గతంలో కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ శెట్టి, సిబ్బంది పాల్గొన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top