12 ఏళ్ల క్రితం వివాహం.. ఇద్దరు కుమారులు.. అదనపు కట్నం తేవాలని..
సాక్షి, సారంగాపూర్(కరీంనగర్): అదనపు వరకట్నం తీసుకురావాలని వేధిస్తున్న భర్త, అత్తామామలపై సారంగాపూర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ప్రొబేషనరీ ఎస్సై (పీఎస్సై) రజిత కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన మిర్యాల సుమలతకు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన మిర్యాల మహేశ్తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో మహేశ్కు సుమలత తల్లితండ్రులు ఒప్పుకున్న ప్రకారం వరకట్నం ముట్టజెప్పారు.
సదరు దంపతులకు ఇద్దరు కుమారులు. కొన్ని రోజులుగా అదనంగా మరో రూ.3 లక్షలు కట్నం తీసుకురావాలని భర్త, అత్త పోశవ్వ, మామ లక్ష్మీనారాయణలు సుమలతను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పీఎస్సై తెలిపారు.