ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో పెన్సిల్ బాక్స్ కోసం ఆర్డర్ చేసిన మహిళ చివరకు తన బ్యాంకులో ఉన్న రూ.5 లక్షలను పొగొట్టుకుంది. మోసపోయానని తెలుసుకోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బషీర్బాగ్లోని సైబర్ పోలీసుల వివరాల ప్రకారం.. టోలిచౌకీ అల్హస్నగర్ కాలనీకి చెందిన జరీనా జబీన్(66) ఈ నెల 22న ఇంట్లో ఫేస్బుక్ చూస్తుంది. అందులో ఏవీ క్రియేషన్స్ వారి ప్రకటన చూసింది. అందులో రెండు పెన్సిల్ బాక్సులకు ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో పెన్సిల్ బాక్స్ 229 కాగా రెండు బాక్సులకు డబ్బులు ఆన్లైన్ ద్వారా చెల్లించింది.
కాగా 24వ తేదీ వరకు డెలివరీ రాకపోవడంతో ఏవీ క్రియేషన్స్ ప్రకటనలో ఉన్న దీపుదాస్కు 9163269043 ఫోన్ చేసింది. అక్కడ నుంచి మీ ఆర్డర్ క్యాన్సల్ అయ్యిందని జవాబు వచ్చింది. తాను ఆర్డర్ క్యాన్సల్ చేయలేదని దీపూదాస్కు ఫోన్లో తెలిపింది. కస్టమర్ సపోర్ట్ నెంబర్ 74881971కు ఫోన్ చేయాలని దీపూదాస్ తెలిపాడు. కస్టమర్ సపోర్ట్ నుంచి రూ.5 రూపాయలు పే చేయాలని కస్టమర్ సపోర్ట్ వీ2 ఏపీకే ఫైల్ వాట్సప్లోకి వచ్చింది.
కాగా ఆమె ప్రతినిధి అడిగినట్లే ఐదు రూపాయలు పంపింది. మరుసటి రోజు నుంచి ఆమె ఖాతా ఉన్న కెనెరా బ్యాంక్ నుంచి డెబిట్ మెస్సేజ్లు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె ఈ నెల 29న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం ఒకే రోజు వివిధ డెబిట్ల ద్వారా మొత్తం రూ.5,24,102 తన ఖాతా నుంచి పోయాయని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మజ్లిస్ పార్టీలో ధిక్కార స్వరం!


