పటాన్‌చెరులో ఘరానా మోసం... మూడు తులాల బంగారం తీసుకొని | Gold Chain Polish Gang Cheating Woman In Medak | Sakshi
Sakshi News home page

పటాన్‌చెరులో ఘరానా మోసం  

Dec 12 2021 10:08 AM | Updated on Dec 12 2021 10:08 AM

Gold Chain Polish Gang Cheating Woman In Medak - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

సాక్షి, పటాన్‌చెరు(మెదక్‌): బంగారం, వెండి ఆభరణాలను శుభ్రం చేస్తామని వచ్చి మోసం చేసేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన పటాన్‌చెరు పట్టణంలోని లక్కదొడ్డి కాలనీలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఆనంద్‌కుమార్‌ సాహా, రాజ్‌కుమార్‌ సాహాలు లక్కదొడ్డి కాలనీకి వచ్చారు.

సుకన్య అనే మహిళకు మాయమాటలు చెప్పి నల్లగా ఉన్న పుస్తెలతాడును శుభ్రం చేస్తామని చెప్పి తీసుకున్నారు. వారి వెంట తెచ్చుకున్న కొన్ని రసాయనాలల్లో పుస్తెలతాడును ముంచి తీశారు. అంతే మూడు తులాలు ఉన్న పుస్తెలతాడు రెండు తులాలు కరిగిపోయి తెగిపోయింది. దీంతో అనుమానం వచ్చిన సుకన్య నిలదీసేలోపే ఒక నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించారు.

గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు క్రైం సీఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టుబడిన ఇద్దరు బీహార్‌కు చెందిన వారని, మహారాష్ట్ర సోలాపూర్‌కు రాత్రి వచ్చి ఉదయం పటాన్‌చెరు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement