ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు | Five Maoist Militia Members Arrested In Bhadradri Kothagudem District | Sakshi
Sakshi News home page

ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు

Dec 4 2022 1:23 AM | Updated on Dec 4 2022 1:23 AM

Five Maoist Militia Members Arrested In Bhadradri Kothagudem District - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ వినీత్‌   

కొత్తగూడెం టౌన్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నిషేధిత మావోయిస్టు పార్టీ మిలీషి­యా సభ్యులు ఐదుగురిని పోలీసు­లు అరెస్టు చేశారు. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) వారోత్సవాల సందర్భంగా వాటిని విజయవంతం చేయాలని మావోయిస్టులు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశారు. మరోపక్క ఆదివాసీలను మావోయిస్టులు వేధిస్తున్నారంటూ ఊరూరా పోస్టర్లు వేయించిన పోలీసులు ఇంకో పక్క కూంబింగ్‌ ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా ఐదుగురు మిలీషియా సభ్యులు పట్టుబడగా, వివరాలను కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శనివారం ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ వెల్లడించారు. చర్ల మండలం ఎర్రంపాడు ఆటవీప్రాంతంల్లో పోలీసు, సీఆర్పీఎఫ్‌ సిబ్బందితోపాటు స్పెషల్‌ పార్టీ, 81, 141 బెటాలియ¯న్ల సిబ్బంది ఉదయం కూంబింగ్‌ చేపట్టారని, ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా మిలీషియా సభ్యులని తేలిందని చెప్పారు.

వీరిలో ఛత్తీస్‌గఢ్‌లోని పోలీసు కిష్టారాం నిమ్మలగూడెంకు చెందిన బెడమ బీమయ్య, సోడి మూయా, పోడియం అడమయ్య, పూనం నగేశ్, జట్టపాడుకు చెందిన మడకం నగేశ్‌ ఉన్నారని తెలిపారు. వీరు రెండేళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.

కాగా, తెలంగాణ ప్రజలు, ఆదివాసీలు వివేకంతో ఆలోచించి అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టులను తరిమివేయగా, ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయి ఇక్కడ ఇన్‌ఫార్మర్ల సాయంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎస్పీ ఆరోపించారు. మావోయిస్టులకు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో ఓఎస్‌డీ సాయి మనో­హార్, భద్రాచలం ఏఎస్పీ ఆకాం„Š  యాదవ్, చర్ల సీఐ అశోక్, బెటాలియన్ల అధికారులు కమల్‌వీర్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement