ప్రాణం తీసిన కునుకు.. | The Driver Was deceased in a Car Accident at Palamaner | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన కునుకు..

Jul 12 2021 9:24 AM | Updated on Jul 12 2021 10:13 AM

The Driver Was deceased in a Car Accident at Palamaner - Sakshi

సాక్షి,చిత్తూరు (పలమనేరు): పెళ్లి చూపుల కోసం కుటుంబం మొత్తం కారులో బెంగళూరుకు బయలుదేరింది. పలమనేరు సమీపంలోని నాగమంగళం వద్ద చెన్నై– బెంగళూరు జాతీయ రహదారిలో వెళ్తుండగా కారు డ్రైవర్‌ కునుకు తీశాడు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఫ్లైఓవర్‌ నుంచి పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న మరో రోడ్డుపై పడింది. ఘటనలో డ్రైవర్‌ మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఒంగోలు సమీపంలోని కందుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు సాయిరామ్‌ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతని పెళ్లి చూపుల కోసం కుటుంబ సభ్యులు శనివారం రాత్రి కందుకూరు నుంచి కారులో బెంగళూరు బయలుదేరారు.

ఆదివారం ఉదయం నాగమంగళం వద్దకు రాగానే డ్రైవర్‌ నిద్ర మత్తులోకి జారుకున్నాడు. కారులోని వారు నిద్రలో ఉన్నారు. దీంతో అదుపు తప్పిన కారు బెంగళూరు రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న చిత్తూరు రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ రామభరత్‌(30) తలకు గాయమై అక్కడిక్కడే మృతిచెందాడు. సాయిరామ్‌(30), అతని తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు(64), వెంకటరమణమ్మ(58), సోదరి కుసుమకుమారి(36) గాయపడ్డారు. 108 సిబ్బంది బాధితులను పలమనేరు ఆస్పత్రికి తరలించారు. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement