ఇంటర్‌ యువతిని వెంటాడి, వేధించి గొడ్డలితో నరికేశాడు

Delhi Class 11 Student Hacked To Death With An Axe By Stalker - Sakshi

గత  ఆరు నెలలుగా యువతికి వేధింపులు  

తండ్రి మందలించినందుకు కక్ష పెంచుకున్నవైనం

అదును చూసి గొడ్డలితో వేటు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలపై వరుస అరాచకాలు, హత్యలు కలకలం రేపుతున్నాయి. తనను పట్టించుకోవడంలేదన్న ఆగ్రహంతో ఇంటర్‌ చదువుతున్న యువతిని గొడ్డలితో నరికి చంపాడో ప్రబుద్ధుడు. ఆరు నెలలపాటు వెంటాడి, వేధించి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడిన వైనం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెడితే..ఢిల్లీలోని మోతీబాగ్ ప్రాంతంలో నివసిస్తున్న యువతిపై, నిందితుడు ప్రవీణ్‌ వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రితో చెప్పుకుంది.  దీంతో తండ్రి ప్రవీణ్‌ను కొట్టి, తీవ్రంగా మందలించాడు. ఇక అప్పటినుంచి మరింత రెచ్చిపోయాడు. ఎలాగైనా యువతి మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే గత నెల ఒక గొడ్డలిని కూడా కొనుగోలు చేశాడు. సోమవారం సాయంత్రం షాపునుంచి ఇంటికి వెళుతున్న ఆమెపై కాపుకాసి గొడ్డలితో ఎటాక్‌ చేశాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్రగాయాలతో కొద్దిసేపటికే   మరణించింది. యువతి హత్యానంతరం హర్యానాకు పారిపోయిన ప్రవీణ్‌ను, సోదరి ఇంట్లో మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

తమకొక ఎలక్ట్రిక్ షాప్, ఫ్రూట్ షాప్ ఉందని, ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు షాపులో తన సోదరి కూర్చునేదని, ఆ సమయంలో ప్రవీణ్‌ వేధించేవాడనీ మృతురాలి సోదరి వాపోయింది. పగతో దారుణంగా తన సోదరిని పొట్టనపెట్టుకున్నాడని కన్నీరుమున్నీరుగా విలపించింది. అంతేకాదు పుట్టినరోజుకు ముందే చంపేస్తానని  ప్రవీణ్‌ బెదిరించేవాడని చివరికి అన్నంతపనీ చేశాడని  రోదించింది. 

కాగా  గత వారం ఒక క్యాబ్ డ్రైవర్, అనుమానంతో ప్రియురాల్ని గొంతుకోసి హత్య  చేశాడు. అలాగే మహిళల పేరుతో వంద నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలను సృష్టించి అశ్లీల సందేశాలు, వీడియోలతో సంచలనం రేపిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top