పేటిఎం పేరుతో మోసం.. లక్షల్లో స్వాహా | Sakshi
Sakshi News home page

పేటిఎం పేరుతో మోసం.. లక్షల్లో స్వాహా

Published Tue, Oct 13 2020 2:10 PM

Cheating With Paytm KYC Update Gang Arrest In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పేటియం కేవైసీ అప్‌డేట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన సీపీ సజ్జనార్‌ ముఠా అక్రమాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పేటియం యాప్ అప్‌డేట్‌ పేరుతో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల నుంచి ఒక్క రూపాయి డిపాజిట్ చేయ్యాలని తొలుత కోరుతారు. ఆ తరవాత ఖాతా వివరాలను సేకరించి.. రిమోట్ యాక్సెస్‌తో లక్షల రూపాయలు కొట్టేస్తారు. నగరంలోనూ ఇలాంటి ఫిర్యాదు తమకు అందడంతో నిఘా వర్గాల ద్వారా విచారణ జరపగా.. మోసం బయటపడినట్లు సీపీ వెల్లడించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నగరానికి చెందిన వినయ్ శర్మ అనే బాధితుడి నుంచి 4లక్షల 29 వేలు కొట్టేశారని తెలిపారు. (బాలికపై అత్యాచారం.. దొంగబాబాకు బడితపూజ)

జార్ఖండ్‌లోని జంతార జిల్లా కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామని సజ్జనార్‌ వెల్లడించారు. జార్ఖండ్ చెందిన నంకు మండల్ అలియాస్ రాహుల్, రాజేష్ మండల్, శివశక్తి కుమార్ అలియాస్ అమిత్ బర్నల్, గౌరవ్ అరుణ్, దిల్ ఖుష్ కుమార్ సింగ్ లను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుంచి 1లక్ష 47 వేల నగదు మొబైల్ ఫోన్లు డెబిట్,క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడినవారంతా సైబర్ నేరాలు చెయ్యడంలో ఆరితేరినవారిన సీపీ పేర్కొన్నారు. పేటీఎం అప్‌డేట్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు వ్యక్తిగత వివరాలను అడిగితే ఎవరికీ ఇవ్వొద్దని సూచించారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement