హిందుత్వాన్ని అవహేళన చేస్తున్న ఏబీఎన్‌  | Sakshi
Sakshi News home page

హిందుత్వాన్ని అవహేళన చేస్తున్న ఏబీఎన్‌ 

Published Tue, Apr 27 2021 4:31 AM

ABN Is Insulting The Hinduism - Sakshi

గుంటూరు రూరల్‌: హైందవ ధర్మంపై, హిందూ దేవుళ్లపై వికృత కార్యక్రమాలు చేసి హిందూ సమాజాన్ని అవహేళన చేస్తున్న ఏబీఎన్‌ యూట్యూబ్‌ చానల్‌పై కఠిన చర్యలు తీసుకుని చానల్‌ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు, హోంమంత్రి మేకతోటి సుచరితకు ఫిర్యాదు చేసింది. సీఐడీ ప్రధాన కార్యాలయంలోనూ ఫిర్యాదు అందజేశారు. గుంటూరులోని సమాఖ్య రాష్ట్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ ఏబీఎన్‌ తెలుగు అనే యూట్యూబ్‌ చానల్‌ లైవ్‌లో ఈనెల 21న శ్రీరామనవమి రోజున లైవ్‌ స్ట్రీమ్‌లో కరోనా వైరస్‌ రామాయణ, రాములమ్మ, కిరాక్‌ న్యూస్‌ అనే కార్యక్రమంలో కరోనా కాండ, రామాయణంలో కరోనా ఉండి ఉంటే అంటూ ఒక కార్యక్రమం చేశారని తెలిపారు.

రాముడిని, సీతమ్మను, రావణాసురుడిని అవహేళన చేసి మాట్లాడటం జరిగిందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కార్యక్రమాలు చేస్తున్న ఆ చానల్‌ను రద్దుచేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. ఇదే చానల్‌ గతంలోనూ ప్రజల్లో మత కలహాలు రేపేలా ముఖ్యమంత్రిపై, తిరుమల శ్రీవేంకటేశ్వరునిపై, పలు హిందూ దేవాలయాలపై అసభ్యకర కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరోనా సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 

Advertisement
Advertisement