FedEX Shooting In US: Four Indians Died In Indianapolis Mass Shooting - Sakshi
Sakshi News home page

ఫెడెక్స్‌ మాజీ ఉద్యోగి ఘాతుకం, నలుగురు భారతీయులు బలి

Published Sat, Apr 17 2021 12:47 PM

4 Sikhs Among 8 Killed In FedEx Shooting In US, Shocked India Offers Help - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలోని ఇండియానాపొలిస్  నగరంలో చోటు చేసుకున్న కాల్పుల్లో చనిపోయిన వారిలో నలుగురు భారతీయులు ఉండటం విషాదాన్ని నింపింది. ఈ  కాల్పుల ఘటనపై విదేశీ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికాలోని ఇండియానా పోలిస్‌లోని స్థానిక అధికారులకు, సిక్కు సంఘ నాయకులకు భారతదేశం అన్ని విధాలా సహాయం చేస్తుందని వెల్లడించారు. నలుగురు సిక్కులు ప్రాణాలు కోల్పోవడంపై సిక్కు సంఘం కూడా  స్పందించింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.  అటు పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌  కూడా ఈ ఘటనపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 4 గురు సిక్కులతో సహా 8 మందిని బలితీసుకున్న ఈ కాల్పుల సంఘటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు.

మరోవైపు  ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి పోలీసులు వెల్లడించారు.  ఎనిమిది మంది మృతుల్లో  నలుగురు సిక్కులున్నారని తెలిపారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, ఇతను ఫెడెక్స్‌ మాజీ ఉద్యోగి అని  పేర్కొన్నారు.  (అమెరికాలో మరోసారి భారీ కాల్పులు: దుండగుడి ఆత్మహత‍్య)

ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం వెల్లడించిన భారతీయ బాధితుల పేర్లు
అమర్ జీత్ జోహాల్ (66)
జస్వీందర్ కౌర్ (64)
అమర్ జీత్ షెఖాన్ (48)
జస్వీందర్ సింగ్ (68)

కాగా ఇండియానాపొలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఫెడెక్స్ గిడ్డంగి వద్ద గురువారం రాత్రి   జరిగిన కాల్పుల్లో ఎనిమిది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బ్రాండన్ స్కాట్‌గా పోలీసులు గుర్తించారు. గత ఏడాది వరకు  ఫెడెక్స్‌ లో  పనిచేసిన బ్రాండన్  విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, తర్వాత  ఆత్మహత్యకు పాలడ్పాడని  అక్కడి పోలీసు అధికారి క్రెయిగ్ మెక్ కార్ట్ చెప్పారు. అతడు గత ఏడాది వరకు పనిచేశాడని చెప్పారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి  ప్రకటించారు.

Advertisement
Advertisement