కౌండిన్య అభయారణ్య ప్రాంతంలో ఒంటరి ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. ఒక గజరాజును పట్టగానే మరొకటి రంగంలోకి దిగుతుండడంతో అధికారులకు సైతం దిక్కుతోచని పరిస్థితులు తలెత్తుతున్నాయి. మొసలిమడుగులో ఒకటి.. అటవీ సరిహద్దుల్లో మరో రెండు సంచరిస్తున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. మదపుటేనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి.
పలమనేరు : జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఒంటరి ఏనుగుల సమస్య తీరేలా లేదు. ఇటీవల ఓ మదపుటేనుగును అటవీశాఖ కుంకీల ద్వారా బంధించింది. అయితే మరో మదపుటేనుగు ముసలిమొడుగులో బీభత్సం సృష్టిస్తోంది. మరో రెండు మదపుటేనుగులు కౌండిన్యలో ఒంటరిగా సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మదపుటేనుగుల కారణంగా ఈ ప్రాంత రైతులకు ఇప్పట్లో కష్టాలు తీరేలాలేవు.
పరిష్కారం ఎలా..?
ఏనుగుల సమస్య దశాబ్ధాలుగా తీరని సమస్యగా మారింది. అడవిని దాటుతున్న ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడు ల్లో రైతుల ప్రాణాలు గాల్లోకలుస్తున్నాయి. అడవిని దాటి బయటకొచ్చిన ఏనుగులు సైతం వివిధ కారణాలతో మృతి చెందుతున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటిదాకా అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాలు ప్రయోజనం లేకుండా పోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి గజరాజులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు చేపట్టింది. అయితే మొత్తం మదపుటేనుగులను బంధిస్తే కానీ ఈ సమస్య తీరేలా లేదు.
అన్నింటినీ బంధిస్తేనే..
కుంకీల ద్వారా ఒంటరి ఏనుగులను బంధిస్తేగానీ ఈ సమస్య పరిష్కారమైయ్యేలా కనిపించడం లేదు. దీంతోపాటు అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా పూర్తి స్థాయిలోమ సోలార్ ఫెన్సింగ్ను నిర్మించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. పలమనేరు మండలంలోని పెంగరగుంట నుంచి చెత్తపెంట దాకా సోలార్ ఫెన్సింగ్ లేనందునే ఏనుగులు యథేచ్ఛగా రైతుల పంటలపై పడడం, గ్రామాల్లోకి రావడం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హడల్ పుట్టిస్తున్నాయి
అసలే ఇది మేకింగ్ సీజన్ కావడంతో కౌండిన్యలో ఒంటరిగా తిరుగుతూ మదమెక్కిన ఏనుగులు తర చూ జనావాసాలపైకి వస్తున్నాయి. వీటిని మళ్లించేందుకు ఎలిఫెంట్ ట్రాకర్స్ బాణాసంచా పేల్చడం, జనం అరుపులు వీటికి మరింత ఆగ్రహాన్ని తెప్పించి ప్రజల తిరగబడేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు మొదలైయ్యాక మదపుటేనుగులు మరింతగా రెచ్చిపోవడం అటవీశాఖకు నిద్రపట్టడంలేదనే చెప్పాలి. ఽఽఏనుగులు ధాన్యం, నీటి కోసం బోర్లు, పైపులు, కసితో కుక్కలు, ఆవులు, దూడలపై ప్రతాపం చూపుతున్నాయి.


