మాతృ మమకారం అమూల్యమైంది. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కళ్లెదుటే మరణిస్తే కడుపు కోత భరించలేనిది. అయితే జ్ఞానం గల మనుషులే తమ వారు మరణిస్తే తేలికగా తీసుకుంటూ ఉంటారు. కొందరైతే కనీసం పరామర్శించకుండా వెళ్లిపోతుంటారు. అలాంటి ఒక వానరం తన బిడ్డ ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడి మృతి చెందితే తల్లడిల్లి పోయింది. కళేబరాన్ని వదిలి వెళ్లకుండా నరకయాతన అనుభవించింది. మంగళవారం ఈ ఘటన కుప్పం మండలం గుడ్లనాయనపల్లె వద్ద జరిగింది. గ్రామ సమీపంలోని చర్చి వద్ద చెట్లపై కోతుల గుంపు ఆడుకుంటూ ఉండగా ఒక కోతిపిల్ల పట్టుతప్పి కిందపడి కన్నుమూసింది. దీంతో తల్లి కోతి తన బిడ్డ కళేబరం పట్టుకుని వేదనతో కుమిలిపోయింది. చివరకు తనతో పాటు చెట్టు పైకి లాక్కుని వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూసిన స్థానికుల హృదయం చలించిపోయింది.
– కుప్పంరూరల్


