పరీక్షల కోసం నిరీక్షణ
తిరుపతి సిటీ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం వారు రెండో సంవత్సరంలో అడుగుపెట్టారు. 2025–26లో పలు యూజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఒక సెమిస్టర్ పరీక్షలు మాత్రమే నిర్వహించారు. తర్వాత రెండో సెమిష్టర్ పరీక్షలు చేపట్టలేదు. ఇందుకు గత ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబర్, నవంబర్ వరకు కొనసాగడమేనని అధికారులు చెబుతున్నారు. 2026–2027 విద్యా సంవత్సరం ప్రారంభమై సెకండ్ ఇయర్లోకి అడుగుపెట్టినా సెకండ్ సెమిస్టర్ పరీక్ష నిర్వహణపై వర్సిటీ అధికారులు దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు సెకండ్ ఇయర్ సిలబస్ చదువుతూ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షల కోసం ఎలా సన్నద్ధమవ్వాలని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల ఆలస్యంపై అధికారులను వివరణ కోరగా ఈ నెల చివరి వారంలో నిర్వహిస్తామని సమాధానమిచ్చారు. మే నెలలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వేసవి సెలవుల కారణంగా వాయిదా వేసినట్టు తెలిపారు. ఇప్పుడు పరీక్షల నిర్వహణ కోసం కసరత్తు చేస్తున్నామని, ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తామని చెబుతున్నారు.
ఎస్జీఎస్లో 8 నుంచి పరీక్షలు
అటానమస్ హోదా పొందిన టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలల్లో యూజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు గత నెల 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 8వ తేదీతో ముగియనున్నాయి. కానీ అటానమస్ హోదా పొందిన ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో పలు పోటీ పరీక్షలకు కేంద్రంగా కేటాయించిన నేపథ్యంలో కాస్త ఆలస్యమైందని, ప్రాక్టికల్స్ ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్నాయని, ఈ నెల 8 నుంచి థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెక్షన్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


