‘అక్షర గోవిందం–అన్నప్రాసనం’ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘అక్షర గోవిందం–అన్నప్రాసనం’ ప్రారంభం

Jul 4 2026 12:32 AM | Updated on Jul 4 2026 12:32 AM

తిరుపతి రూరల్‌: చిన్నారుల విద్యారంభాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో మంగళప్రదంగా ప్రారంభించే లక్ష్యంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘అక్షర గోవిందం–అన్నప్రాసనం’ కార్యక్రమం శుక్రవారం తిరుపతి శివారులోని శ్రీ వకుళామాత ఆలయంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర పాల్గొని చిన్నారులు ఆశీర్వదించారు. అనంతరం చిన్నారులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ‘అక్షర గోవిందం కిట్‌’లను ఉచితంగా పంపిణీ చేశారు. అమ్మవారి సన్నిధిలో తయారైన ప్రసాదాలతో పలువురు చిన్నారులకు అన్న ప్రాసనం నిర్వహించారు.

తిరుపతిలో సంస్కృత అకాడమీ

తిరుపతి సిటీ: తిరుపతిలో సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, స్థలం కోసం టీటీడీకి లేఖ రాశామని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్‌ ఆర్డీ విల్సన్‌ శరత్‌చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఎస్వీ గోశాల వద్దగల తెలుగు, సంస్కృత అకాడమీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకాడమీ ద్వారానే విద్యార్థులకు టెక్ట్స్‌ పుస్తకాలు సరఫరా ఉంటుందని, ప్రైవేటు సంస్థలు సైతం అకాడమీ పుస్తకాలనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తమిళనాడు తరహాలో వర్చువల్‌ అకాడమీ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి ఆదేశాల మేరకు డీపీఆర్‌ తయారు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ చైర్మన్‌గా ఉన్న లక్ష్మీపార్వతి చేసింది ఏమీ లేదన్నారు.

పాలిసెట్‌ ఆప్షన్‌ ఎంట్రీకి నేడే ఆఖరు

తిరుపతి సిటీ: పాలిసెట్‌లో అర్హత సాధించి పలు పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ ఎంట్రీ చేసుకునే ప్రక్రియ శనివారంతో ముగియనుంది. 5వ తేదీ ఆదివారం ఆప్షన్స్‌ మార్పునకు అవకాశం ఇస్తూ 7వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో 8వ తేదీన రిపోర్టు చేసి తరగతులకు హాజరుకావాల్సి ఉంటుందని పాలిసెట్‌ అధికారులు తెలిపారు.

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

తిరుపతి అర్బన్‌: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ ఏవీఎస్‌ సూర్యనారాయణరాజు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం బాలల హక్కుల పరిరక్షణపై అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు అన్ని విభాగాలకు చెందిన అధికారులతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని కోరారు. కమిషన్‌ సభ్యులు గాంధీబాబు, శ్రీనివాసమూర్తి, పద్మలత, డీఆర్వో నరసింహులు, ఐసీడీఎస్‌ పీడీ వసంతబాయి, డీఎంఅండ్‌హెచ్‌వో బాలకృష్ణ నాయక్‌, బీసీ వెల్పేర్‌ అధికారి భరత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement