చిత్తూరు కలెక్టరేట్ : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆ సంఘ నాయకులు శుక్రవారం చిత్తూరులో డీఆర్వో మోహన్కుమార్కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్త, ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి మానుకోవాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల వల్లే విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం సంభవించిదని మండిపడ్డారు. ఈ ప్రమాదంలో పదిమంది కార్మికుల ప్రాణాలు కోల్పోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎంతో కార్మికులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ దాసరి చంద్ర, జిల్లా నాయకులు నాగరాజులు మాట్లాడుతూ విశాఖ ఉక్కును కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ప్లాంట్ను కాపాడుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంవత్సరాలుగా కార్మికులు పోరాడుతున్నా ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్త నిర్ణయం ప్రకారం దశలవారీ పోరాటంలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆంజనేయులు, రాజా, ఏఐటీయూసీ నాయకులు విజయ్ కుమార్, రఘు, మణి తదితరులు పాల్గొన్నారు.


