వి.కోట : టోల్ ప్లాజా సిబ్బందిపై అధికార పార్టీ నేతల అనుచరులు దాడిచేసిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని దానమయ్యగారిపల్లి టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. మండలంలోని మద్దిరాళ్ళ గ్రామానికి చెందిన దళిత యువకుడు మంజునాథ్ టోల్ప్లాజాలో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి అధికార పార్టీ నేతలు, అనుచరుల వాహనాలు పలమనేరు నుంచి వి.కోట వైపునకు వచ్చాయి. నేతల వాహనాలు ఎటువంటి రుసుం తీసుకోకుండా టోల్ ప్లాజాలో వదిలేశారు. అనుచరుల వాహనాలను మంజునాథ్ ఆపాడు. దీంతో రెచ్పిపొయిన అనుచరులు వాహనం ఆపి ‘మా వాహనాలనే ఆపుతావా.. నీకు ఎంత ధైర్యం’ అంటూ మూకమ్మడిగా పిడిగుద్దులు గుద్ది అతనిపై దాడిచేశారు.
టోల్ సిబ్బంది నిరసన
ఘటనతో అగ్రహించిన టోల్ సిబ్బంది విధులను బహిష్కరించి టోల్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. గతంలో కూడా నాయకులు ఇలాగే తమపై దాడిచేశారని, పోలిసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంట పాటు సాగిన ఈ నిరసనతో వాహనాల రాకపొకలకు అంతరాయం ఏర్పడి వాహనాలు కీలోమీటరు మేర బారులు తీరాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ షేక్వలి సంఘటన స్థలానికి చేరుకుని సిబ్బందితో చర్చించారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సిబ్బంది నిరసన విరమించారు.


