ఐరాల: మండలంలోని కోళ్లపల్లె సమీపంలోని వ్యవసాయ పొలంలో తమ 60 కొబ్బరి మొక్కలను నరికివేశారని బాధిత దంపతులు సుబ్రమణ్యంరెడ్డి, చంద్రమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ కోళ్లపల్లె రెవెన్యూ పరిధిలో మూడెకరాల వ్యవసాయ భూమిలో తన పేరిట కొంత భూమిని పెట్టుకుని, మిగిలిన భూమిని తన ఇద్దరు కుమారులకు పంచిపెట్టామని తెలిపారు. కాగా తన మొదటి భార్య చనిపోవడంతో చంద్రమ్మను రెండో వివాహం చేసుకున్నాని చెప్పారు. చంద్రమ్మకు కుమారుడు నిరంజన్రెడ్డి, కుమార్తె మౌనిక సంతానం కలిగారని తెలిపారు. రెండేళ్ల క్రితం తన పెద్ద కుమారుడు నరేష్రెడ్డి ఇంటిలో నుంచి గెంటేశాడని వాపోయారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తన రెండో భార్య కుమారుడు నిరంజన్రెడ్డి చిత్తూరు నగరంలోని సంతపేటలో అద్దె ఇంటిలో ఉంచి తమ సంరక్షణ చూసుకుంటున్నాడని తెలిపారు. సంవత్సరం క్రితం నిరంజన్రెడ్డికి సంక్రమించిన ఆస్తిలో మామిడి, కొబ్బరి చెట్లను నరేష్రెడ్డి దౌర్జన్యంగా నరికివేసిన ఘటనపై తన రెండో కుమారుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. కాగా గ్రామ పెద్దలు మధ్యస్తం ద్వారా రాజీ చేసినట్లు చెప్పారు. శుక్రవారం మరోసారి పొలంలో ఉన్న సుమారు 60 కొబ్బరి మొక్కలను నరేష్రెడ్డి దౌర్జన్యంగా నరుకుతుండగా, తాను, తన భార్య అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కత్తితో నరికి చంపుతానని బెదిరించాడని వాపోయారు. ప్రాణ భయంతో డయల్ 112కు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.


