కుప్పం రూరల్ : పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు, గ్రామస్తులు ఐకమత్యంగా ఉండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం సాయంత్రం పరిశ్రమలకు భూములు ఇచ్చిన పొగురుపల్లి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి వచ్చిన 33 సమస్యలపై అధికారులతో చర్చించి అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలన్నారు. కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని పేర్కొన్నారు. పెద్ద ఇండస్ట్రియల్ పార్కు వస్తుండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, మౌలిక వసతులు వస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఈ గ్రామానికి వస్తున్నారని, ఆయన రైతులతో మాట్లాడతారని చెప్పారు. ఆయనతో సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడా ఏపీడీ శ్రీనివాసరాజు, ఆర్డీవో షేక్ మహ్మద్ హుస్సేన్, తహసీల్దారు సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.


